14 భాగం

 

14

ఆ తర్వాత ఋతువులకి తగ్గట్లుగా యధావిధిగా రాజభవనాలకి తిరిగి వచ్చేవాళ్ళము. ఒక ప్రక్క రాజకీయ జ్ఞాన పాఠాల విజ్ఞానము పొందుతూనే మరొక ప్రక్క వేదజ్ఞానమును నేను పెంపొందించుకొనేవాడిని. తను ఏ పనిలో నిమగ్నమైనా  నా వైపు.... నేను చేస్తున్న పని వైపు... నేను ఆలోచిస్తున్న ఆలోచనల గూర్చి ఒక చెవి, తన మనస్సును యశోధర ఎల్లప్పుడు ఉంచేది.

                        నేను కాస్త అవకాశము దొరికినప్పుడల్లా వేదపండితులతో, వేద గురువులతో నా వాదనలతో తలపడేవాడిని. తలపండిన వీరిని నా ప్రతిభ వాదనలతో వాళ్లకి తలలు తిరిగేటట్లుగా వాదించేవాడిని. నా వాదనయే సత్యమని వాళ్లు అంగీకరించేవాళ్లు. ఇలా సాధుసన్యాసులతో, భిక్షువులతో, మత పెద్దలతో, మతగురువులతో వాదించేవాడిని. నా వాదనలలో సత్యమున్నదని నిరూపించేవాడిని. ఎందుకంటే నేను ఎంతో భక్తిగా అనురక్తిగా, మంత్రయుక్తంగా, రాగయుక్తంగా, స్వరయుక్తంగా , అర్దయుక్తముగా, వేదాలు వేదాల అంతరార్ధాలు తెలుసుకున్నాను. అలాగే వేద మంత్రాలకు మహత్తర శక్తి ఉన్నదని శబ్దోఛ్చారణ  సరిగా ఉంటే మహా అద్భుతాలు, మహత్కార్యాలు  చేయవచ్చునని నిరూపించవచ్చునని  గ్రహించిన వాడిలో ప్రథముడిగా ఉండేవాడిని. నాకు వేదాల మీద అలాగే వేద జ్ఞానము మీద ఎలాంటి అపనమ్మకము లేదు. కాని వాటిని మిడి మిడి జ్ఞానముతో నేర్చుకొనే వేదపండితులంటేనే నాకు అసహ్యము ద్వేషముండేది. వేదాలలో నిజానికి దేవతాస్తుతులు మాత్రమే ఉన్నాయని బ్రాహ్మణులకి లోకవిదితమే గదా. వాటిని అడ్డుపెట్టుకొని అంటే జ్ఞానకాండను కాస్త తమ భుక్తికోసము భక్తికాండముగా మార్చడమే నాకు ఇష్టము లేకపోయింది. ప్రజలు ఏదో రూపములో త్రిమూర్తులను ఆరాధించడము నాకు ఇష్టమే. అందులో ఎలాంటి తప్పులేదు.

ఎందుకంటే నమ్మకము ఉంటే కాని భక్తి కుదరదు. భక్తి ఉంటే కాని ఆత్మ విశ్వాసమేర్పడదు.

ఇంతవరకు బాగానే ఉంది. అందుకు నేను సమ్మతిస్తాను. కాని ఈ త్రిమూర్తుల ప్రతినిధులుగా తాము పూజించాలని.... ఆరాధన చెయ్యాలని.... సంభావనలు ఇవ్వాలని... గురుదక్షిణలు ఇవ్వాలని ఆశించే వేద పండితుల ఆగడాలు నాకు నచ్చేదికాదు. చిన్న పని నుండి పెద్ద పనిదాకా.... పుట్టుకనుండి గిట్టుటదాకా ఈ పురోహితుల మంత్రాల అవసరాలను సృష్టించి ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని వీరంతా దండిగా దక్షిణల పేరుతో, దానాల పేర్లతో నవధాన్యాల నుండి నవరత్నాలదాకా భయపెట్టి...బాధపెట్టి...ఆశపెట్టి... నయానా తొక్కిపెట్టి వీటిని తీసుకొనేవారిని నేను ఎదిరించాను.

*** *** *** *** *** ***

అంగుళీమాల తన చేతికి వచ్చిన ఎ.బి.సి.బ్యాంక్ తాళం చెవితో ఆ బ్యాంక్ కి వెళ్ళి అక్కడున్న బ్యాంక్ మేనేజర్ దగ్గరికి సరాసరి వెళ్లి తనని దేవదత్త గురూజీ పంపించినాడని చెప్పగానే ఆ మేనేజర్ మారుమాట్లాడకుండా అంగుళీమాల చేతిలో లాకర్ కీ తీసుకొని గది బయటికి వచ్చి లాకర్ ఉన్న గదికి వెళ్ళి ఈ లాకర్ కీ తో అక్కడున్న ఒక లాకర్ ను తెరచిచూడగా అందులో పాతకాలమునాటి తోలుసంచి ఒకటి ఉండటముతో దానిని తీసుకొని వచ్చి అంగుళీమాలకి ఇవ్వడముతో వెంటనే ఇతను ఇక్కడ నుండి తన బైక్ మీద తన రహస్యగదికి వెళ్ళిపోవడము జరుగుతుంది.



గదికి వెళ్లిన అంగుళీమాల తన చేతిలోని తోలుసంచి బలవంతముగా విప్పి తెరచి చూడగా అందులో ఒక పద్మాకార ఇత్తడి తాళం చెవి అలాగే ఒక పాతకాలం నాటి తాళపత్రాలు కనిపించేసరికి ఆశ్చర్యానందమునకు గురి అవుతూ దేవనాగర లిపిలో ఉన్న ఆ తాళపత్రములోని విషయము పైకి పెద్దగా చదువుతూ.. పద్మ మణి దారికి పొందడానికి అడుగు దూరములో ఉన్నావు.దీనికోసము పద్మ కీ స్టోన్ ఎక్కడ ఉన్నదో ముందుగా తెలుసుకోవాలి. ఇది భగవాన్ బుద్ధుడు సంచారము చేసిన కపిలవస్తు, లుంబిని, శ్రావస్తి, కోనంబి, సారనాధ్, ప్రయాగ,కాశి,సాకేత,రామ గ్రామ, పావ, కుసినార, పాటలీపుత్ర, రాజగృహ, ఉజ్జయిని,సాంచి,బుద్ధగయ క్షేత్రాలలోని బౌద్ధ మ్యూజియములలో ఒకచోట మాత్రమే ఈ పద్మ కీ స్టోన్ భద్రపర్చబడినది.అది ఎక్కడ ఏ ప్రాంత మ్యూజియములో ఉన్నదో తెలుసుకొని ఈ ఇత్తడి కీ తో తెరిచినట్లైతే నీకు కావలసిన పద్మ మణి దారి తెలుస్తుంది.

అంటే..తను ఈ క్షేత్ర మ్యూజియాలుకు వెళ్లి కీ స్టోన్ ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటే మణి ఎక్కడ ఉన్నదో తెలుస్తుంది అనుకొని అమిత ఆనందమును పొందుతూ అంటే ఇన్నాళ్ళు లేని మణి ఇపుడు నిజముగానే ఉన్నదని  తెలియడముతో బుద్ధిలో మార్పులు రావడము మొదలైంది.తనే స్వయముగా ఈ మణి ఎక్కడ ఉన్నదో తెలుసుకొని దానిని చేజిక్కించుకుంటే ఈ విశ్వానికి ఏకముగా అధినేత గావచ్చును గదా అనుకోగానే..పాపము మరి దేవదత్త గురువుకి గురుద్రోహము చేసినట్లుగా అవుతుంది గదా అనే ఆలోచన రావడముతో ఏమి చేయాలో వాడికి అర్ధము కాలేదు.ఒకవైపు తను మణి ప్రయత్నములు వ్యక్తిగతముగా చేసుకుంటే అలాగే గురువుకి ద్రోహము చేయకుండా ఎపుడి వివరాలు అపుడు దేవదత్త గురువుకి అందిస్తూ ఉంటే చివరికి మణి ఉన్న చోటుకి తనే వెళ్ళవలసి వస్తుంది గదా.అపుడు ఏమి చేయాలో ఎలాచేయాలో అలోచించుకోవచ్చును అనుకొని..

దేవదత్త గురువుకి ఫోన్ చేసి లాకర్ లో దొరికిన తాళ పత్రాలు వివరాలు చెప్పడముతో

దేవదత్త వెంటనే అంగుళీ.నీవు వెంటనే ఆయా క్షేత్రాలలో ఒక్కొక్క దాని దగ్గరకు వెళ్ళి ఆ మ్యూజియము అధికారులకు నా పేరు చెప్పు. నీకు గావలసిన సమాచారము ఇస్తారు.అపుడు నీకు కీ స్టోన్ దొరికితే  నాకు సమాచారము అందించు.ఆ తర్వాత ఏమి చేయాలో నీకు నేను చెబుతాను అని ఫోన్ కట్ చేశాడు.

దానితో అంగుళీమాల ఆనందబడి ఈ క్షేత్రాలలో వారణాసి క్షేత్రంలోని బౌద్ధ మ్యూజియమునకు వెళ్ళి అక్కడ పద్మ కీ స్టోన్ ఉందో లేదో తెలుసుకోవాలని నిశ్చయించుకొని ప్రశాంతముగా నిద్ర లోనికి జారుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి