33 భాగం

 

33

ఇదే సమయములో ఈ గ్రామ దేవతకి నైవేద్యము సమర్పించడానికి పాలపాయసము తీసుకొని ఆ గ్రామ పెద్దాయన కూతురు అయిన సుజాత వెళుతుండగా... దారిలో స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి... జాలిపడి... నా ప్రాణము పోతుంది అని భయపడి ఆ గ్రామ దేవతకి సమర్పించవలసిన ప్రసాదమును నాకు ఇస్తూ నన్ను బ్రతికించింది. నా ప్రాణమునకు ఊపిరి పోసింది. దానితో నేను కాస్త ఉపవాసాలు చెయ్యరాదని ప్రతిరోజు ఈ గ్రామానికి భిక్షకి వెళ్లి గుహలో ధ్యానము చేయడము కన్నా అరణ్యములో ఒక చెట్టు నీడ యందు ధ్యానము చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. దానితో ప్రతిరోజు నదీ స్నానము చెయ్యడము, మధ్యాహ్నము దాకా ధ్యానము చేసుకోవడము భిక్ష కోసము ఊరువిల గ్రామానికి వెళ్ళడము లేదంటే అప్పుడప్పుడు సుజాత తెచ్చే ఆహారమును భిక్షగా తిని కొంతసేపు ఆమెతో లోక విషయాలు మాట్లాడి... ఆమె వెళ్లిన తర్వాత రాత్రి పొద్దు పోయేదాకా ధ్యానము చేసుకుంటూ ఉండేవాడిని.

నేను ఇలాంటి సాధనా స్థితిలో ఉన్నప్పుడు నా మలి గురువైన ఉద్రకమహర్షి ఆశ్రమము నుండి అక్కడ నాకు పరిచయమైన స్నేహితుడైన కౌండిన్య, వారి నలుగురి మిత్రులతో కలిసి నా దగ్గరికి వచ్చి నా సాధన స్థితిని చూసి అబ్బరపడి నాకులాగానే గుహలలో సాధన  చెయ్యడము ప్రారంభించారు. మాలో ఒకరు ప్రతిరోజు గ్రామానికి భిక్షకి వెళ్లి అందరికి భిక్ష తేవడము జరుగుతూండేది. ఇలా కొన్ని వారాలు గడిచాయి. కాని మా స్నేహితులకి నా సాధన స్థితి విధి విధానము అర్ధము కాలేదు. అంటే ఉదయ సాయంత్రాలలో నదీస్నానము చెయ్యడము, అడవిలో పడుకోవడము, భిక్ష తెచ్చే సుజాతతో ఊసులాడటం వారికి నచ్చలేదు. అప్పుడికే నా సాధన స్థితి ఎలా ఉండేది అంటే నడకలో ధ్యానం, పడకలో ధ్యానం, మనస్సులో ధ్యానం, నడుస్తున్న ధ్యానం, తింటున్న ధ్యానం, మాట్లాడుతున్న ధ్యానం, ఆటలు ఆడుతున్న ధ్యానం, కూర్చున్న ధ్యానమే, నిల్చున్న ధ్యానమే... సర్వం ధ్యానమయములా ఉండేది. అంటే ధ్యానము అంటే ఒక పనిగా చేసేవాడిని కాను. చేసే ప్రతి పని గూడ ధ్యానమేనని భావన చేసేవాడిని. అన్నము తిన్నతర్వాత కలిగే ఆనందము...ధ్యానములో మనస్సు ఏకాగ్రత పొందినపుడు కలిగే ఆనందము నాకు ఒక్కటిగానే ఉండేది. తేడా ఉండేదిగాదు. ఎందుకంటే ఆనందస్థితి అనేది ఒక్కటే గదా.

ఇలా ప్రతిదానిలో నా మనస్సుకి ధ్యానము చేస్తున్నాను అనే భావస్థితిని కలిగించేవాడిని. కాని చూసేవాళ్లకి నా బాహ్య ప్రపంచ చేష్ఠలే అంటే అన్నము తినడము, సుజాతతో మాట్లాడటం, స్నానాలు చెయ్యడము, స్నానాలు చెయ్యకపోవడం, అతిగా నిద్రపోవడం, బద్ధకముగా ఉండటం ఇలా ఎన్నో ఎన్నెన్నో కనిపించేవి. అంటే నా శరీరము భోగముగాను నా మనస్సు యోగముగా ఉంచే దానిలో నేను జాగ్రత్త పడేవాడిని. ఈ విధమైన నా సాధన స్థితిని నా పంచ స్నేహితులు అర్ధము చేసుకోకపోగా అపార్థము చేసుకొని నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. దానితో నేను వారిని ఉండమని వారించలేదు. ఎందుకంటే ఎవరి సాధన వారిది. ఎవరి జ్ఞానము వారిది. ఎవరికి వారే సాధన చేసి జ్ఞానము పొందాలని అనుకొనేవాడిని. కాని నిజానికి నాకే జ్ఞానోదయం కాలేదు. జ్ఞానము పొందుతానని వారిని నమ్మించే ప్రయత్నము చెయ్యలేకపోయాను. అసలు నాకు సత్యదర్శనమైతే అది ఇతరులకి ప్రపంచానికి జ్ఞానబోధ చెయ్యవచ్చు అని అనుకున్నాను.

                    ఇలా నేను సత్య దర్శనము కోసము పగలు, రాత్రి సమయాలలో చెట్టు క్రింద కూర్చొని ధ్యానము చేస్తుండేవాడిని. మిట్ట మధ్యాహ్న సమయములో నేను ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు 9 సంవత్సరాల వయస్సున్న స్వస్తి అనే పిల్లవాడు ప్రతిరోజు పశువుల్ని మేపుకు వచ్చేవాడు. ఆ సమయములో నన్ను దూరముగానే చూసి వెళ్లిపోయేవాడు. ఒకరోజు నేను మధ్యాహ్నము ధ్యానములో యుండగా.... నన్ను ఎవరో చూస్తున్నారు అన్పించి కళ్లు తెరవగానే ఎదురుగా స్వస్తి ఉన్నాడు. రా. మిత్రమా. రోజు నన్ను చూస్తావు కాని మాట్లాడకుండా వెళ్ళిపోతావు. నీ పేరు ఏమిటి? అని అతడి భుజము మీద ఆప్యాయముగా చెయ్యివేసి మాట్లాడేసరికి.... వాడి ముఖములో అంతులేని ఆనందము వేస్తు నన్ను ప్రేమగా చూస్తూ...

స్వామి. మీరుఎవరు?” అని నన్ను అడిగాడు.

నేనొక సన్యాసిని అనగానే....

స్వామి మీరు సన్యాసి అంటే యోగదండము, కమండలం, గడ్డాలుండాలి గదా అనగానే....

మిత్రమా. పాత సాంప్రదాయాలకి స్వస్తి పలికి క్రొత్త అవతార సాంప్రదాయమునకు నాంది అయినాను అనగానే...

స్వామి. మీరు నాపేరు అయిన స్వస్తి పలికారు.అవును. మీరు నన్ను తాకారు గదా? మీరు మైలపడ్డారు. ఎందుకంటే నేను అస్పృశ్యుడని. అని వాడు బాధగా చెపుతుంటే...

నేను వెంటనే...స్వస్తి. మరి నేను నిన్ను తాకాను గదా. మరి నేను మైల పడ్డానా? మనిషికి మనిషికి మధ్య మైల ఉండదు.అది ఉందని చెప్పేవారి మాటలు నమ్మకు. వినకు అనగానే... స్వస్తికి ఆనందమేసింది.

             ఇంతలో అక్కడకి నాకు భోజనము సుజాత తెచ్చింది. ఈ లోపల స్వస్తిగూడ తన చద్ది మూట విప్పి భోజనానికి దూరంగా కూర్చున్నాడు. ఇది గమనించిన నేను వెంటనే వాడికేసి చూస్తూ స్వస్తి. రా. మా దగ్గర కూర్చో. అందరం కలిసి భోజనము చేద్దాం. అవును నీ భోజనము నాకు పెడ్తావా?” అని నేను అడిగేసరికి వాడి ఆనందానికి అంతులేదు. తల్లి ఆవు దగ్గరికి లేగదూడ పరిగెత్తుకొని వచ్చినట్లుగా నా దగ్గరకి వచ్చి వాడి చేతులతో ఆప్యాయంగా నాకు భోజనము పెడుతున్న దృశ్యము చూసిన సుజాతకి ఆనందమేసింది. దానితో మేము ముగ్గురము కలిసి మా భోజనాలు ఒకరికొకరం పంచుకొని తృప్తిగా భోజనము ముగించాము. అప్పుడికే వాడికి సుజాతతో పరిచయము ఉన్నప్పుడికి ఆవిడ పెద్దింటి అమ్మాయి అని పలకరించడానికి భయపడేవాడు. కాని ఈ రోజు జరిగిన తంతు వలన వాడిలో ఎక్కడలేని మనోధైర్యము వచ్చి సుజాతకేసి చూస్తూ అమ్మాయిగారు. మీరు నాకు తెలుసు అనగానే....అరే. స్వస్తివిగదా. నువ్వు నాకు తెలుసు అని సుజాత అనగానే వీడిలో సంతోషము ఆగలేదు. దానితో వీరిద్దరూ నాకు నా సాధన స్నేహితులు అయినారు. సుజాత నాకన్నా రెండు, మూడు సంవత్సరాలు వయస్సులో పెద్దది అయితే స్వస్తి నాకన్నా 25 సంవత్సరాలు చిన్నవాడు గావడము విశేషమే గదా. ఇలా మేము ముగ్గురము ఆటలు, పాటలు ఆడుతూ జాతక కథలతో కాలము గడిపే వాళ్లము. వీళ్లు వెళ్లిపోయిన తర్వాత నా ధ్యానములో మిగిలిన సమయము గడిపేవాడిని.

*** *** *** *** *** ***

కులకర్ణి,త్రివేది తమ ఎదురుగా ఉన్న మానిటర్ లోని దృశ్యాలను చూస్తుంటే ఏదో మిస్టరి సినిమా చూస్తున్నంత ఉత్కంఠకి గురి అవ్వసాగారు.నిర్వణలామా కాని ఈ కోడ్ ని డీకోడ్ చేయలేకపోతే వీళ్ళ పోలీసు అధికారులు లోపలకి చేరుకొనేలోపల అంగుళీమాల తన చేతిలో ఉన్న మానవ బాంబ్ పేల్చితే పరిస్థితి ఏమిటని ఒకరికొకరు కంగారుపడుతున్నారు. భయపడుతున్నారు. ఏమి జరుగుతుందో అని ఆరాటపడుతున్నారు.ఏమి చేయాలో గూడ వీరిద్దరికి అర్ధముకాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.ఇంతలో వీరి దృష్టి నిర్వాణలామా డీకోడ్ ను చేసే విధానమును తమ మానిటర్ లో గమనించసాగారు.నిర్వాణలామా తన దగ్గర ఉన్న కోడ్ ను చదవడము ప్రారంభించాడు.

కంటకము-147

కంటకము అంటే బుద్ధుడి గుఱ్ఱము పేరు అయ్యి ఉండాలి.మరి 147 అంటే క్వర్టి(qwerty)కీ బోర్డ్ లోని నం లాక్(Num Lock) లోని అంకెలు అలాగే 147 అని నిలువు వరుసగా కనబడతాయి.అంటే కీ బోర్డ్   ప్రకారము చూస్తే కంటకము గుఱ్ఱము అనే దానిలో గుఱ్ఱమును 147 అంకెల ప్రకారముగా ఇంగ్లీష్ లోకి మార్చి చూస్తే క్వర్టి(qwerty) కీ బోర్డ్ ప్రకారముగా 147 నంబరులు ఎదురు వరుసలో ఉన్న ఇంగ్లీష్ అక్షరాలను అంకెలుగా మార్చుకొని పొతే మనకి అనగా

కంటకము-147

గుఱ్ఱము-147

HORSE-147

47747-147

వస్తుంది.అంటే బహుశా దీనికి పాస్ వర్డ్ ఇదే అనుకొని దీనిని అంకెల ప్రకారము వాటిని సెట్ చేయగానే మణి బాక్స్ తెరుచుకోవడము అంతే క్షణములో ఇది గమనించిన అంగుళీమాల మారు ఆలోచించకుండా తనకి తెలియకుండానే ఒక తప్పు చేస్తూ విభూధినాధ్ ని విడిచిపెట్టి నిర్వాణలామా చేతిలో తెరచుకున్న మణిబాక్స్ ను అందుకొని అందులో ఏముందో చూడాలని ఆత్రుతతో తెరవపోతుండగా

నిర్వాణలామా వెంటనే అక్కడున్న మిగిలినవారందరిని ముక్కులు మూసుకొనమని కనుసైగ చేయడము

ఈ సైగను అంగుళీమాల గమనించకపోవడము

ఈ బాక్స్ లోపల నుండి విషపూరిత వాయువులు వెలువడుతూ దివ్యమైన కాంతులు విరజిమ్మేసరికి   కాంతి దెబ్బకి అంగుళీమాల కళ్ళు మూసుకుపోవడము విషవాయువులు పీల్చడముతో స్పృహ కోల్పోవడము ఏకకాలములో జరిగిపోయాయి.దానితో వాడు పూర్తిగా స్పృహ తప్పినాడని తెలుసుకున్న నిర్వాణలామా బృందము వీడి చేతిలో ఉన్న మణిబాక్స్ దగ్గరికి వచ్చి చూస్తే అందులో కాంతులు విరజిమ్ముతున్న ఎరుపు,తెలుపు,నీలము రంగులుండి భో-అ-క్షి అక్షరాల ఆకారములో మూడు స్ఫటిక రత్నాలు ఉన్నాయి.వీటిని చూడగానే కులకర్ణి,త్రివేది ఆలోచనలో పడ్డారు.అలాగే నిర్వాణలామా ఆలోచన చేసి అంటే ఈ మూడు రత్నాలు బహుశా అంబేద్కర్ చనిపోయిన గదిలోని మూడు బుద్ధ చిత్రాలకి ఉన్న మూడు అక్షరాల గుర్తులకి ఈ మూడు రత్నాలు సరిపోతాయని గ్రహించి వీటిని తన చేతిలోకి తీసుకుంటుండగా హఠాత్తుగా పోలీసులు మరియు సి.బి.ఐ అధికారులు తమ చేతులలో ఆయుధాలతో చుట్టుముట్టడము  అలాగే ఎన్నాళ్ళనుంచో పట్టుకోవాలని ఎదురుచూస్తున్న దేవదత్త తొత్తు అయిన నరహంతకుడైన అంగుళీమాల స్పృహ తప్పి ఉండేసరికి వాడిని తమచేతిలోని బేడీలతో బంధించి పోలీసు వాహనములోకి ఎక్కించే ప్రయత్నము చేయగా మిగిలిన వారికి సావధానముగా అందరిని బుద్ధగయ ప్రాంతమునకు తీసుకొనే వెళ్ళే ఏర్పాట్లు చేసే దృశ్యమును తమ మానిటర్ లో చూసిన కులకర్ణి అలాగే త్రివేది గూడ బౌద్ధమ్యూజియమునకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోసాగారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి