49 భాగం

 

49

నేను ఎప్పుడైతే తధాగతుడి సాధన స్థితిని పొందినానో ఆనాటి నుండి 'మంది' గూర్చి ఆలోచించడము మానివేసి కేవలము 'మది' గూర్చి ఏకాంతముగా ఒంటరిగా ఆలోచనలు చెయ్యడము ఆరంభించాను. దానితో మిగిలిన వారందరు గూడ నాకు వయస్సు అయిపోయిందని... మునుపటి ఉత్సాహాలు, బోధనలు, నాలో తగ్గినాయని... దానితో ఈ సంఘ బాధ్యతల నుండి నన్ను తప్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానితో నా అజాత శత్రువైన దేవదత్త... నేను ఉన్న బౌద్ధ సంఘ అధ్యక్ష పదవి నుండి నన్ను తప్పించి వాడు అవ్వాలని నా మీద హత్యా ప్రయత్నాలు చెయ్యడము ప్రారంభించాడు. దానితో నా మీద మూడు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఆ సమయములో నా ప్రియ శిష్యులే నన్ను రక్షించారు. దానితో నాలో అంతర మధనము మొదలైంది. ఒక వైపు ఈ సంఘములో చీలికలు తేవటానికి దేవదత్త రాజకీయ కుతంత్రాలు చేస్తున్నాడు మరొక వైపు నా ప్రియ శిష్యులు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆకారణముగా చంపబడటము మొదలైంది. దానితో నాకు అన్నింటి మీద స్మశాన వైరాగ్యము కల్గడము మొదలైంది.

                  దీనికి తోడు 80 సంవత్సరాల వృద్ధాప్యపు నీలినీడలు పరుచుకున్నాయి. ఒక ప్రక్క ఆరోగ్యము సహకరించడము లేదు. దీనికి తోడుఏర్పరచిన అనేకమనేక బౌద్ధ సంఘాల అవసరాలు చూడవలసిన బాధ్యత ఏర్పడింది. దీనికి తోడు నా ఆత్మీయులు ఒక్కొక్కరుగా నా కళ్ల ముందు ఒకరి తర్వాత మరొకరు ఈ ప్రపంచము నుండి శాశ్వత నిద్రకోసము నిష్క్రమించడముతో నాలో తీవ్రమైన ఆవేదనకి నాంది అయింది. ఇది ఇలా ఉంటే అత్యాశకి పోయిన నాకు అజాత శత్రువైన 'దేవదత్త' గూడ తీవ్రమైన నయంకాని అనారోగ్యమును పొంది నన్ను ఆఖరి చూపుగా చూస్తూ 'బుద్ధం' శరణం అని నన్ను చూస్తూ ప్రాణాలు వదలాడు.

                  కొన్నిరోజులకి నాలో తీవ్రమైన అనారోగ్యసమస్యలు మొదలైనాయి. దానితో నా అంతిమ ఘడియలు దగ్గర పడుతున్నాయని నా అంతర్వాణి ప్రబోధము చెయ్యడము మొదలుపెట్టింది. దానితో నా అంతిమ బాధగా వైశాలి నగరములో కపాలి ఆలయము వద్ద అందరిని సమావేశ పెట్టి చెప్పడము మొదలుపెట్టాను. వారితో...

1 . ధ్యానమును ఒకపనిగా చెయ్యకండి. చేసే ప్రతి పనిని ధ్యానముగా చెయ్యండి.

2 . సాధన చేస్తే అన్ని బోధపడతాయి.

3 . ప్రతిఒక్కరు ధ్యానముతోనే మనలోని జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి.

*** *** *** *** *** ***

నాలుగు మంచుకుక్కలు కనిపించేసరికి అందరు కంగారు పడ్డారు.ఇంతలో నిర్వాణలామా ముందుగా తేరుకొని మిగిలిన వారితో

మీరు కంగారుపడి నన్ను కంగారు పెట్టకండి.మీరు భయపడకండి.వీటిని ఇక్కడ రేచు కుక్కలు అంటారు.ఇక్కడ ఉండే షేర్పాలు అనేవాళ్ళు వీటిని తమ గొర్రెలమందను కాపాడుకోవటానికి వీటిని వేటకుక్కలుగా పెంచుతారు.ఇవి ఇపుడు మనల్ని తమ శత్రువులుగా భావించుకుంటున్నాయి.కదలకుండా శిలలగా నిశ్చలముగా నిలబడిపొండి.వీటి యాజమాని ఇక్కడికి వచ్చేదాకా ఇవి కాపల కాస్తూ మనల్ని చూస్తూ అరుస్తూనే ఉంటాయి.మనము కదిలాము అంటే మన కండలు పీకేదాకా ఇవి నిద్రపోవు అని హెచ్చరించగానే అందరుగూడ వీటి యాజమాని రాక కోసము ఎదురుచూస్తూ విగ్రహాలుగా నిలబడిపోయారు.కొద్దిసేపటికి అక్కడికి గొర్రెలమందను మేపుకొని వస్తున్న వీటి యజమాని షేర్పా కనిపించి..ఈ నాలుగు కుక్కలను చూస్తూ తన చేతిలో ఉన్న కర్రను వాటికి అర్ధమయ్యేభాషలో నేలమీద కొడుతూ ఏవో సంజ్ఞలు చెయ్యగానే అపుడిదాకా అరిచి గోల చేసిన ఈ కుక్కలు కాస్త వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రేమగా కాళ్ళను నాకి ముందుకి వెళ్ళిన తర్వాత షేర్పా తన గొర్రెలమందను తీసుకొని పర్వతము దిగడము ప్రారంభించాడు.

ఆ తర్వాత నిర్వాణలామా మిగిలిన ఇద్దరితో అయితే మనము ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఈ కుక్కలను ఇక్కడవాళ్ళు పెంచుతున్నారంటే వీళ్ళు పెంచే గొర్రెలమందకి ప్రాణాపాయము కల్గించే తోడేళ్ళు లేదా పులులు లేదా సింహాలు ఈ పరిసర ప్రాంతాలలో తిరిగే అవకాశాలు చాలా ఎక్కువని తెలుస్తోంది.అంటే మనము మరింత ప్రమాదకర స్ధాయి ప్రాంతమునకు అడుగు పెట్టినట్లే.ఇపుడిదాకా మనము తినే జంతువులనే చూసి ఉన్నాము.ఇపుడు మనల్ని తినే జంతువులను చూడబోతున్నాము.కాబట్టి అందరుగూడ అతిజాగ్రత్తగా అప్రమత్తతగా మలచుకోండి.ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్న మన ప్రాణాలు మన చేతిలో ఉండవు.సరాసరి యముడు చేతి పాశమునకు చేరతాయని గుర్తుపెట్టుకోండిఅని హెచ్చరిక చేసి తమకి ఎదురైన ప్రతిపొదను అనుమానముగా చూస్తూ అక్కడ ఏమిలేదని రూడి చేసుకొంటూ వీరంతా ముందుకి సాగుతుండగా..

వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నగూడ జరిగేది జరగక మానదని అన్నట్లుగా

ఇంతలో అనుకొని ఆపద లాగా

ఒక మంచుపులి యొక్క భయంకర పులిగ్రాండిపులు తమకి సమీపములో వినిపించేసరికి ఈ ముగ్గురు గూడ బిత్తరపోయి భయపడుతూ నిశ్చలముగా శిలలుగా నిలబడిపోయారు.

ఆనందభిక్షువు తేరుకొని గురూజీ..వేటకుక్కలకి అయితే బొమ్మలుగా నిలబడవచ్చును.ఎందుకంటే అవి మనల్ని తినవు.అదే పులులు దగ్గర గూడ ఇలా బొమ్మలుగా నిలబడటం నా వల్ల కాదు.ఎందుకంటే నేను ఖచ్చితముగా దీనికి ఆహారము అవుతానేమో భయముగా ఉంది.ఏదో ఒకటి చెయ్యండి.మీకు మంత్రాలువచ్చు గదా. వాటితో దీనిని స్తంభన చెయ్యవచ్చు గదా అనగానే

నిర్వాణలామా వెంటనే మిత్రమా.ఇపుడు మనము ఉన్న స్ధితిలో నాకు వచ్చిన మంత్రాలు ఏవి గుర్తుకు రావడము లేదు. ఆ వచ్చేది పులి కాబట్టి మనము ఏమైన మంత్రము లేదా తంత్రము చేసేలోపే అది మనల్ని తిని చక్కా పోతుంది.అది వచ్చి ఏమి చేస్తోందో చూసేదాకా మనము ఏమి చెయ్యలేము.అది ఆకలి మీద ఉంటే మనము దానికి ఆహారమవ్వక తప్పదు.ఒక వేళ దానికి ఆకలి లేదంటే మనల్ని ఏమి చెయ్యకుండా తనదారి తాను వెళ్ళిపోతుంది.కాని నాకు దీని గాండ్రింపు వింటూంటే మంచి ఆకలి మీద ఉన్నట్లే అనిపిస్తోంది అనగానే

ఆనందభిక్షువు వెంటనే మీ మంత్రతంత్రాలు పనిచెయ్యవు.ఆ వచ్చే పులి ఆగదు.ఇక్కడ నాకు తడవడము ఆగదు. ఏంది స్వామి. నిన్ను నమ్ముకొని వస్తే పులికి అప్పచెపుతావా? ఇది ఏమైనా న్యాయముగా ఉందా..అమ్మా..గురుమాత..నీవైన ఏదో ఒకటి చెయ్యి.నాకు ఇక్కడ ఒకటి ఆగకుండా ధారాపాతముగా రావటానికి సిద్ధముగా ఉంది అనగానే

ప్రకృతి వెంటనే ఆనందా..నీవు పొరపడుతున్నావు.మన కోసము ఒకటి గాదు ఏకముగా పులి గుంపు వస్తోంది.ఒక పులి గాండ్రింపుకే నీకు ఒకటి వస్తే అదే పులుల గుంపుకి నీకు రెండు గూడ రావడము ఖాయముగా అనిపిస్తోంది అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూండగా

ఏదో అనుమానము వచ్చి నిర్వాణలామా నేలను చూడగానే ఆ మంచు మీద ఏకముగా పులుల గుంపు పాదముద్రలలో సుమారుగా 20 దాకా చిన్న పులి పిల్లల పాదముద్రలుండేసరికి అంటే ఇక్కడ దగ్గరలో పులిపిల్లలున్నాయని గ్రహించి చుట్టుప్రక్కల కేసి  పరిశీలించి చూడగా ఎదురుగా సుమారు 50 గజాల దూరములో ఒక మంచు గుహ ఉన్నట్లుగా కనిపించేసరికి విషయము అర్ధమైన

నిర్వాణలామా మిత్రమా...మనము ఏకముగా పులుల కుటుంబము నివసించే మంచుగుహ అయిన వాటి గృహము దగ్గర ఉన్నాము.వాటి పిల్లలకి మనము ఏమైన ప్రమాదము కల్గిస్తామోనని అవి అరుపులతో బెదిరిస్తున్నాయి.మనము సన్యాసదీక్షలో ఉండుటవలన అవి అరుపులే అరుస్తున్నాయి.లేదంటే ఈ పాటికి వాటికి మనము ఆహారము అయ్యేవాళ్ళము అనగానే..

ఆనందభిక్షువు వెంటనే గురూజీ..వాటికి మనము ఆహారము అవ్వడము లేదని మీకు బాధగా ఉన్నట్లుగా ఉంది.ప్రమాదము గూర్చి ఆలోచించకుండా వాటి గూర్చి ఆలోచనలు చేస్తున్నారే.అవి ఎక్కడ ఎందుకు ఉంటే మనకెందుకు.వాటి నుండి మనము ఎలా బయట పడాలో ఆలోచించండి.ఇక్కడ నాకు రెండు ప్రకృతి కార్యాలు ప్రారంభము అవ్వడానికి అట్టే సమయము పట్టదు.ఆపై మీ ఇష్టం.అందుకే మన పెద్దలు మనము తినే వాటిని పెంచుకొండి..మనల్ని తినేవాటికి దూరముగా ఉండండి చెపితే ఏమో అనుకున్నాను.ఇపుడు కళ్ళారా చూస్తేకాని నాకు అర్ధమై చావలేదు అని అంటూండగా

ఇంతలో ఎవరు ఊహించని విధంగా ఎదురుగా …. …..

రెండు పెద్ద పులులు పైగా వీటి సంతానమైన అయిదు పిల్ల పులులు సహా వీళ్ళ ముందుకి వచ్చేసరికి ఎవరికి నోటమాట రాలేదు.

వీళ్ళు ఏమి చేస్తారని అవి చూస్తున్నాయి.

ఇవి ఏమి చేస్తాయని వీళ్ళు చూస్తున్నారు.

ఇంతలో ఒక పెద్దగా ఒక తాగుబోతు అరుపులు వినబడేసరికి

వీళ్ళు చూపు అటు వైపు పడగా..ఆ తాగుబోతు అయిన పిచ్చోడి మాదిరిగా వాడి చూపు వీళ్ళ మీద పడగా—

చూడటానికి ఇతను కోలముఖముగా..చిరు గడ్డముతో..చింపిరి జుట్టుతో..అర్ధ నగ్నముగా..నడుమకి చిరుగులున్న పసుపు రంగు వస్ర్తముతో...ఒక చేతిలో ఆడకుక్కను పట్టుకొని మరొ చేతిలో సారాయి ఉన్న పాత్ర పట్టుకొని వీళ్ళ కేసి..అక్కడున్న పులులు కేసి అదోలా చూస్తూ

వీళ్ళతో ఎంది భయముగా ఉందా..ప్రాణాలు పోయేదాకా ప్రాణాలు హరించే హరుడిని తల్చుకోరు గందా..ఏమిటి సంగతి..అంతే గందా..ఇదే జీవిత సత్యమే గందా... అవును మీ ప్రాణాలు ఎలాగో వాటి ప్రాణాలు అంతే గందా..ఇపుడు నేను మీలో ఎవరి ప్రాణాలు కాపాడాలో మీరో తేల్చుకోండి.అపుడిదాకా నేను ఇక్కడే ఉంటా.ఏమి జరుగుతుందో చూడాలి గందా.అదే నా పని గదా.అంటూ కొద్దిసేపు అయిన తర్వాత ఏటు తేల్చుకొని వీరిద్దరికి కేసి చూసి

మాట్లాడే జీవాల కన్నా మాట్లాడని జీవాలే మిన్న అంటూ

అక్కడ ఉన్న పులుల గుంపు కేసి చూస్తూ ఏమే..ఈ బోడిగుండు జీవాలు మీ పిల్ల జీవాలను ఏమి చెయ్యరు.ఏమి చెయ్యలేరు.ఎందుకంటే వీళ్ళు శాంతమూర్తులు.పైగా వీళ్ళకి తెలిసి ఎవరికి వేటికి హాని కల్గించరు.నాకు ఇలాంటి దీక్షాపరుల గురించి  నాకు బాగా తెలుసు. పోండి.మీ మంచు గృహమునకు పోండిఅనగానే

ఇవి కాస్త ఈయన పెంపుడు జంతువులులాగా ఆనందముగా పెద్ద తోకలు ఆడిస్తూ..సంతోషముగా చిన్నతోకలు ఆడించుకుంటూ ఈ గుంపు కాస్త తాముండే గుహ వైపు వెళ్ళడము చూసిన ఆనందభిక్షువుకి అదుపులేని ఆనందమును పొందుతూండగా

ఇది గమనించిన పిచ్చోడు వెంటనే స్వాములు.ఎందాకా మీ ప్రయాణము.ఇంత భయంకరమైన ప్రాంతములోని అదిగూడ లోకానికి తెలియని చోటుకి ఎందుకు వచ్చారు.ఎందుకు వెళ్ళుతున్నారు.కొంపతీసి ఇక్కడున్న మణుల కోసమా?లేదా ఇవి ఉన్నాయో లేదో చూద్దామని వచ్చారా లేదా వీటిని దొబ్బుకొని వెళ్ళద్దామని వచ్చారా?  ముందు మీలో ఉండే జీవమణులు సంగతి ఆలోచించండి.వాటిని మహాకాలుడు తన మృత్యువుతో ఎత్తుకొనేలోపుల వాటిని ఉపయోగించుకోండి.ఈ ప్రకృతిలో ఉండే మణులు ఎలాగో అలాగే ఉంటాయి.వాటిని చూడటానికి తప్ప ఏమి చెయ్యలేరు.అయిన ఇవి ఉన్నాయో లేదో ఈ పాటికి ఎంతో మంది ఎన్నో సం.రాల నుండి వస్తున్నారు.పోతున్నారు గందా.ఇపుడు మీరు కొత్తగా వీటి గూర్చి తెలుసుకొని ఏమి చేస్తారు అనగానే

 నిర్వాణలామా అందుకొని స్వామి...మేము మణుల కోసము అలాగే అవి ఉన్నాయో లేదో అని నేను శోధన చెయ్యటానికి రాలేదు.నా ప్రక్కనే ఉన్న మా ఆవిడికి చింతామణి తీర్ధము తాగిస్తే ఈమెకి వచ్చిన అనారోగ్యము పోతుందని నాగాసాధువు చెప్పితే తెలియని ఆ మణి కోసము ఇలా ఇక్కడిదాకా వచ్చి మీ వలన రక్షించబడినాము అనగానే

ఈ పిచ్చోడు కాస్త ప్రక్కనే ఉన్న ప్రకృతి కేసి అదోలా చూస్తూ..

దీనికి ఏమైంది.బాగానే గుండ్రాయి లాగా గుండ్రముగా ఉంది గదా.దీనికి ఏమి మాయరోగం అనగానే

ఇది విన్న ప్రకృతికి అమితకోపము వచ్చి ఈయనతో ఏమయ్యా..నాకేమి రోగముంటే నీకు ఎందుకు..లేకపోతే నీకెందుకు..మమ్మల్ని రక్షించావు. నీ దారి నీవు పో. మా రోగాలు గూర్చి మేము చూసుకుంటాము అనగానే

 పిచ్చోడు వెంటనే అరే..స్వామి.నువ్వు చెప్పితే నాకు అర్ధము కాలేదు.నిజముగానే మీయావిడికి ఏదో ఉన్మాదరోగముంది.ఈ రోగమున్న వారికి తప్పనిసరిగా మణితీర్ధము త్రాగించాలి.లేదంటే ఇలాగే అయినకాడికి కానికాడికి గొడవలకి దిగుతారు.ప్రతి చిన్నదానికి ఉన్మాదము పొందుతారు.అపుడపుడు నేనుగూడ ఈ ఉన్మాదమును పొందుతూ ఉంటానని నన్ను కొందరు ప్రాపంచిక విషయాలు దాటిన అవధూత అంటారు. అపుడు నేను నాకున్న ఉన్మాదము తగ్గించుకోవటానికి చతుర్ధశి అమావాస్య కాళ రాత్రి సమయములో పిశాచాలు,దెయ్యాలు,ప్రేతాలు,భేతాళుడు వంటి మహాశక్తులన్ని వశము చేసుకోవటానికి  ఛోడ్ అనే తాంత్రిక హోమము చేస్తూ భేతాళ తాండవము చేస్తాను. ఆ తర్వాత రహస్యగ్రామానికి వెళ్ళి అక్కడున్న మణితీర్ధమును సేవించగానే నాకున్న ఉన్మాదము పూర్తిగా తగ్గిపోతుంది. ఓ పిల్లా..నీవు ఆ తీర్ధము తీసుకోగానే నీ మాయరోగం తగ్గుతుందిలే.భయపడకు.నీ రోగము ఏమిటో నాకు తెలిసింది.నీ మాయరోగం నాకు అర్ధమయింది అనగానే అపుడు కాని నిర్వాణలామాకి ఈయన ఏవరో తెలియరాలేదు.తెలిసిన తర్వాత మౌనము వహించాడు.

ఆ తర్వాత ఈ అవధూత అందరితో కలిసి భిక్ష చెయ్యాలని ఉంది అనగానే అందరు కలిసి భిక్షకి కూర్చున్నారు.ఈయన ఏవరో తెలియని ఆనందభిక్షువు ఈయనను ఆటపట్టించాలని అనుకొని

స్వామి..మా భిక్ష అయితే దుంపలు,పళ్ళు,తేనె మరి మీ భిక్ష ఏమిటి?” అనగానే

ఇలాంటి వారిని ఒక ఆట ఆడించే ఆయన గూడ వెంటనే స్వాములు..నా భిక్ష ఇంక తయారు చేసుకోలేదు.ఇది తయారు చెయ్యడము చూసినవారు భయపడని వాడే చాలా అరుదుగా నాకు లాగా ఉంటారు.మరి నా భిక్ష తయారి చూడటానికి నువ్వు తయారా?” అంటూ

తన పాత చేతిసంచి లోంచి ఒక పాము కుబసమును బయటికి తీసి అందరికి చూపిస్తూ..ఇందాకే ఇది ఆ మంచురాళ్ళ మధ్య  దొరికింది.ఈ పొట్లకాయ తిని చాలా రోజులైనదని దీనిని తెచ్చుకొన్నాను. నా స్వామి రంగ..దీనికి ఆడకుక్క పాలలో కలిపి తింటూంటే ఎమి రుచిగా ఉంటుందో గందా.అమృతములాగ ఉంటుంది అంటూ ఈ రెండింటిని కలిపి పిసికి ఒక ముద్దగా చేసుకొని తింటూంటే

ఆనందభిక్షువుకి నోటమాటలేదు.అదే ప్రకృతి అయితే బిత్తరపోయింది.

కాని నిర్వాణలామా వెంటనే స్వామి..నాకు ప్రసాదముగా మీరు తినే బ్రహ్మపదార్ధము కొంచెం పెడతారా?” “స్వాములు..ఇది బ్రహ్మ పదార్ధము కాదురా..ఆ బ్రహ్మము దగ్గరికి ఏకముగా పంపే విషపదార్ధము రా..నువ్వు తిన్నావంటే నీ భార్యకి దక్కకుండా పోతావు.అసలే అది పిచ్చిది.నువ్వు లేకపోతే మరింత పిచ్చి ఎక్కుతుంది.ఇక వీడికి గురువు లేకుండా పోతాడు అన్నగూడ

నిర్వాణలామా తను చాచిన చెయ్యి వెనక్కి తీసుకోకుండా అలా భిక్షకి ఉంచగానే ఈ అవధూత కాస్త నిర్వాణా..నువ్వు గూడ నాకు లాగానే అసాధ్యుడివిరా. మొండోడివి. సాధన సాధ్యతే సాధ్యం నిరూపించేవాడివి.అందుకు నీకు యోగ్యత,అర్హత ఉంది.దీని వలన నీ సంకల్పము నేరవేరుతుంది.నేను ఏవరో నువ్వు గ్రహించినావని నాకు అర్ధమయింది.నా యోగమాయ పరీక్ష మాయం అయింది అంటూ నిర్వాణలామా చేతిలో ఇది పెట్టగానే అదికాస్త సువాసనలు వెదజల్లుతూ మగ్గిన మామిడిపండు లాగా మారడం..దానితో ఈ అవధూత లేచి నిలబడి మంచులోంచి సుమారుగా  మూడు అడుగుల పాంచజన్యశంఖమును బయటికి తీస్తూ దానిని పూరించగానే ఈ శంఖ ఓంకారనాదానికి హిమాలయల పర్వతాల దిక్కులు అదిరిపోయే విధంగా మారుమోగుతూండగా

ఈ పిచ్చి అవధూత అదృశ్యమయ్యేసరికి..

ఇలాంటి భయంకర శంఖనాదమును మన మహాచౌహాన్ స్వామి తప్ప ఎవరు చెయ్యలేరని..ఎవరికో ఈయన దర్శన అనుగ్రహభాగ్యము కల్గినదని ఈ పర్వత గుహలలో తపస్సు చేసుకుంటున్న వృద్ద లామాలు,యోగులు,గురువులు,సన్యాసులు అనుకొని ఆనందపడుతుండగా ఇదే విషయాన్ని నిర్వాణలామా మిగిలిన వారికి చెప్పగానే ఈ ముగ్గురు కలిసి ఈయనకి తమ కృతజ్ఞతలు చెప్పుకొని ఖోజార్ నాథ్ ఆలయము వైపు వడివడిగా నడకయాత్రను కొనసాగించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి