48 భాగం

 

48

నా ప్రయాణము హిమాలయాలకి చేరింది. అష్టదళ పద్మాకారములో ఉన్న అష్ట పర్వతాల మధ్య స్పటికమణిలాగా మంచుతో మెరుస్తూ స్పటికములాంటి మంచు పర్వతమైన కైలాస పర్వతము మణిపద్మము లాగా నన్ను బాగా ఆకర్షించినది. దానితో ఈ పర్వతము దగ్గరికి చేరుకోగానే... నాలో తెలియని ప్రశాంత స్థితిని పొందుతూండేసరికి అక్కడున్న యోగులను దీనికి కారణము ఏమిటని విచారణ చేస్తే... ఈ పర్వతము అడుగు భాగములో ఒక రహస్య గ్రామము ఒకటి ఉన్నదని... దాని పేరు అగర్తల యని... ఈ గ్రామములో మహిమాన్వితమైన ఒక చింతామణి శిల ఉన్నదని... దాని ప్రభావము వలన ఇక్కడికి వచ్చిన వారందరికి 12 సంవత్సరాలు ఏకధాటిగా ధ్యాననిష్ఠలో ఉండిన తర్వాత కలిగే పూర్ణ ధ్యానస్థితియైన శాంతి స్థితిని ఈ పర్వతము రాగానే కలుగుతుందని వారు చెప్పగానే నాలో ఆశ్చర్యానందాలు కల్గాయి. దానితో ఈ మార్గము తెలుసుకొని నేను ఒక్కడినే ఈ రహస్య గ్రామ సందర్శనమునకు వెళ్లాను.

                             అక్కడ లోపల నాకు పాదరస ధాతువుతో సప్త ధాతువుల నిర్మిత శాలిగ్రామ శిల అయిన పాదరస చింతామణి దర్శనమైంది. దానిని తాకగానే నేను మొట్టమొదటిగా 40 రోజుల పాటుగా కదలకుండా మెదలకుండా ధ్యాన నిష్ఠలో ఉన్నప్పుడు కలిగిన జ్ఞాన ఆనంద స్థితికి ఇది కొన్ని నిమిషాలలో ఇచ్చేసరికి.... ఈ శాలిగ్రామము స్వయంభుగాదని... సప్త ధాతువుల నిర్మాణమని తెలుసుకొని... బయటికి వచ్చి ఆ ధాతువులతో సింగింగ్ బౌల్ నిర్మాణము కావించాను. దీనిని మ్రోగించడము వలన విశ్వములోని ఓంకార నాదమును వినవచ్చును.

ఆ తర్వాత నాలో ఒక సందేహము వచ్చి మనలో వచ్చే ఓంకార నాదము ఎలా వినాలి అనుకొని దీని కోసము పంచ ధాతువులతో ఒక గంట నిర్మాణము చేసి... దీని మ్రోగించే విధానమును బట్టి మనలోని యోగచక్రాలు జాగృతి అయ్యే విధంగా తయారుచేశాను. దానితో శరీర ఓంకారము వినడము మొదలైంది). ఆ తర్వాత ఈ రెండు నాదాలను ఏకము చెయ్యాలనే ఉద్దేశ్యముతో... 'దోర్జి' అనే పరికరమును తయారుచేశాను. దీనివలన శూన్యములో ఓంకారనాదము మిళితమవడము ఆరంభమైంది. నిశ్శబ్దనాదమైంది. ఈ నాదము ఎలా ఉంటుందో తెలియడానికి ఆ తర్వాత నేను కాస్త ప్రార్ధన చక్రమును తయారు చేశాను. ఈ చక్రము లోపుల నేను చూసిన కైలాసపర్వత పాదరస చింతామణి శిలకు సంబంధించిన

'ఓం-మణి-పద్మ-హుం'

అను గురుమంత్రమును తయారు చేసి దీనిని ప్రతివాడు సాధన చేసి పూర్ణ శూన్య స్థితి పొందాలని దీనిని ఒక కాగితపు చుట్టలో 1000 సార్లు ఈ మంత్రమును లిఖించాను. ఈ మంత్రారాధన ఎవరైతే సంపూర్ణం చేస్తారో వారికి కైలాసపర్వత మణి పద్మములోని పాదరస చింతామణి అనుగ్రహము మరియు ప్రత్యక్ష దర్శనము కలిగే విధముగా ఇది ఎక్కడ ఎలా ఉన్నదో అందరికి తెలియ చెయ్యడానికి 'కాలచక్ర తంత్రమును' తయారు చేశాను. ఇందులో శరీరము,వాక్కు, మనస్సు, జ్ఞానము, ఆనందము అనే అయిదు సోపానాలు మరియు మాయలుగా లేదా అవాంతరాల సంకేతముగా మంచు సింహము, మంచు ఏనుగు, బలిష్ఠ వ్యక్తి,, కాంతి శరీర దేవతలు, మణులు, పద్మాలు, ఆయుధాలు, 16 స్తంభాలు, అష్టదళ పద్మము, అష్ట బిందువులు, 16 తామరపువ్వులు ఇలా ఇందులో అమర్చాను. అర్హత, యోగ్యతను సంపాదించినవారికి మాత్రమే ఇది అర్ధమై... మణి పద్మమైన కైలాసపర్వతములోని పాదరస చింతామణి ప్రత్యక్ష దర్శన భాగ్యమును పొందుతారని ఈ ఏర్పాట్లు ఈ కాలచక్రమునందు ఏర్పాటు చేశాను. నేను పొందిన పూర్ణ శూన్య స్థితియైన మార్పులేని ఆనందస్థితియైన శాంతిస్థితిని అందరు ప్రత్యక్ష అనుభవ అనుభూతి పొంద వచ్చునని అందరు తెలుసుకుంటారని ఈ ఏర్పాట్లు చేశాను. ఆనాటితో బోధి సత్వుడిగా ఉన్న నేను కాస్త తథాగతుడిగా మారి హిమాలయాల నుండి తిరిగి వచ్చి నా అనుభవాలు సర్వ భిక్షులతో చెప్పడానికి రహస్య సమావేశమును ఏర్పాటు చేసి కాలచక్ర తంతు వివరించడము చేశాను. ఆనాటి నుండి తథాగతుడిగా అందరు నన్ను కొలువడము ఆరంభించారు.

*** *** *** *** *** ***

వీళ్ళు ఇలా ముందుకి వెళ్ళుతుండగా ప్రకృతి వెంటనే స్వామి..మన బుద్ధుడు ప్రతిపాదించిన కాలచక్రము ద్వారా ఎవరో శంభల గ్రామ దర్శనమునకు వెళ్ళారని చెప్పారు గదా.అది ఎలా సాధ్యం అనగానే..

ప్రకృతి. మన బుద్ధుడు ప్రతిపాదించిన కాలచక్రము అనేది హిమాలయలలోని అగర్తల గ్రామములో ఉండే పాదరస చింతామణికి దారి చూపిస్తే అదే శ్రీ శంకరాచార్యుడు ప్రతిపాదించిన భూస్తర శ్రీ చక్రము ఈ గ్రామమును చూపిస్తే అదే మేరుశ్రీచక్రమైతే శంభల గ్రామమునకు దారిచూపుతుంది.ఇవి రెండు చూడటానికి వేరే విధంగా కనపడుతున్నగూడ నవనిర్మాణ నిర్మిత గ్రామాల గూర్చి చెపుతున్నాయి.అలాగే కాలచక్రము ఎక్కడ ఆగిపోయినదో అక్కడ నుండి శ్రీ చక్రము మొదలైంది.అనగా కాలచక్రములో 16 స్తంభాల నిర్మాణము చివరిలో వస్తే అదే శ్రీచక్రములో 16 పద్మరేకులుగా ముందుగానే వస్తుంది.పైగా బుద్ధుడు భావన ప్రకారము చూస్తే ఆత్మలేదు,దేవుడు లేడు గావడము వలన ఈయన ప్రయాణము నాకు తెలిసి అగర్తల గ్రామము వరకు వచ్చి ఆగిపోయింది.అదే వీరి తర్వాత తరమువాడైన శంకరచార్యుడు భావము ప్రకారము దేవుడున్నాడు..ఆత్మ ఉంది అని భావించడము వలన ఈయనకి కైలాసపతి అనుగ్రహమును పొంది ఆపై  123 దైవాల ఆవాసమైన నవావరణ నిర్మాణ స్ఫటికభవనమును చూసి నవనిర్మాణ శ్రీచక్ర నిర్మాణము గీయ్యడము జరిగింది.

ఆనందభిక్షువు వెంటనే గురూజీ...అంత ఖచ్చితముగా మన బుద్ధభగవానుడు అగర్తల గ్రామమునకు వెళ్ళారని ఎలా చెప్పగలుగుతున్నారు అనగానే

మిత్రమా..ఈ గ్రామములోనే సప్తథాతువులతో నిర్మిత పాదరస చింతామణి ఉంది.దీని ఆధారముగానే మనము నిత్యము మ్రోగించే సింగింగ్ బౌల్ గూడ సప్తథాతువుల నిర్మాణము బట్టి అలాగే ఈయన పాదముద్రలు మూడుచోట్ల అదిగూడ కైలాస పర్వతము లోపలికి వైపు వెళ్లే మార్గములో ఉన్నాయని లోకవిధితమే గదా అనగానే

గురూజీ..మన బుద్ధుడు శంభల గ్రామమునకు వెళ్ళలేదా?”

వెళ్ళారు.వెళ్ళకపోతే ఆయన కాలచక్రతంతులో రెండు రకాల అనగా నీలిరంగు మరియు పసుపు రంగు డ్యోర్జేలు ఎందుకు పెడతారు. ఇందులో నీలిరంగు డ్యోర్జే అనేది అగర్తల గ్రామములో పురుషశక్తి అయిన అవలోకితేశ్వరుడు శాలిగ్రామమును సూచన అయితే పసుపు రంగు డ్యోర్జే అనేది శంభల గ్రామములో స్త్రీశక్తి అయిన అవలోకితేశ్వరి కి సూచన అన్నమాట.ఈయన ఈ రెండు గ్రామాల దర్శనము చేసుకున్నారని అలాగే ఈ హిమాలయలలో రెండు రహస్యగ్రామాలున్నాయని మనకి తెలియటానికి ఈ రెండు డ్యోర్జేలు వాడటము జరిగింది. గాకపోతే ఈయన ఈ రెండింటి ద్వారా చెప్పితే అదే శ్రీ శంకరాచార్యుడు ఈ రెండు గ్రామాల గూర్చి అనగా భూస్తర శ్రీ చక్రము ద్వారా అగర్తల గ్రామములో ఉండే విష్ణు శాలిగ్రామము గూర్చి చెప్పి మేరుశ్రీచక్రము ద్వారా శంభల గ్రామములో ఆదిశక్తి గూర్చి లోకానికి చెప్పడము జరిగింది.అంటే మన బుద్ధుడు కాస్త రెండు డ్యోర్జేలు ద్వారా వీటి గూర్చి చెప్పితే అదే మన శంకరుడు రెండు చక్రాల ద్వారా ఈ గ్రామాల గూర్చి చెప్పడము జరిగింది అన్నమాట.నిజానికి డ్యోర్జే అనేది పిరమిడ్ అంతర్గతభాగములో ఉండే పంచముఖ స్తంభమును సూచన చేస్తుంది.అనగా అగర్తల గ్రామ అడుగుభాగములో ఉండే పిరమిడ్ కున్న పంచముఖస్తంభము ద్వారా మనము పై భాగములో ఉండే పిరమిడ్ శంభల గ్రామమునకు చేరుకోవచ్చును.ఎందుకంటే డ్యోర్జే అనేది క్రింద భాగమును మరియు పైభాగమును కలిపే స్తంభము వంటి నిర్మాణము అన్నమాట.దీనిని సాధన ప్రకారముగా చూస్తే మన శరీరములో అడుగుభాగములో ఉండే మూలాధారచక్రములో అయస్కాంతశక్తి ని (ఈ చక్రము భూతత్త్వశక్తి కలిగి ఉండుట వలన) మన పైభాగములో ఉండే సహస్రచక్రములోని విద్యుత్ శక్తిని (విశ్వశక్తి ఉండుట వలన) ఒక స్తంభములాగా కలుపుతుంది. ఈ డ్యోర్జే నిర్మాణము ద్వారానే మన బుద్ధుడు కాస్త అగర్త గ్రామము నుండి శంభల గ్రామమునకు చేరుకున్నారు.

ప్రకృతి వెంటనే స్వామి..ఇంతకి నా ప్రశ్నకి మీరు ఇంక సమాధానము చెప్పలేదు.అదే కాలచక్రము అనేది రహస్య గ్రామానికి ఎలా దారిచూపేది అనగానే

ప్రకృతి..మనకి కాలచక్ర నిర్మాణములో అయిదు సోపానాలు కనపడతాయి.అంటే దీనిని క్రిందకి నుండి పైకి  ఒకసారి చూస్తే మనకి మొదట ఆరు వృత్తాలు కనపడతాయి.ఆ తర్వాత నాలుగు ద్వారాలున్న గాలిగోపురాల నిర్మాణము కనపడుతుంది.దీనిని శరీరం (body) అంటారు. ఈ గాలిగోపురాలను మోస్తూ మనకి మంచు ఏనుగులు, మంచు సింహాలు, బలిష్ఠమైన మంచు మనుష్యులు కనపడతారు.అలాగే వీరి మధ్య కాంతిశరీర దేవతలు కనపడతారు.అలాగే ఖరీదైన ఆభరణాలు, రత్నాలు,మణులు ఉన్నట్లుగా మనకి కనపడతాయి. ఈ నిర్మాణ మూలాలలో మనకి డబుల్ డ్యోర్జీలుంటాయి.దీనిపైన ఇలాంటి నిర్మాణమే మళ్ళీ కొంచెము తక్కువ పరిమాణములో మరొకటి కనపడుతుంది.దీనిని వాక్కు (speech) అంటారు.దీనిపైన ఇలాంటి నిర్మాణమే మళ్ళీ కొంచెము తక్కువ పరిమాణములో మరొకటి కనపడుతుంది.దీనిని మనస్సు (mind) అంటారు. ఆ తర్వాత మనకి మూడు పొరలుండి సీలింగ్ ఉన్న 16 స్తంభాల నిర్మాణము ఉంటుంది.దీనిలో నాలుగు స్తంభాలలో నాలుగు నల్లని కత్తులు మరో నాలుగు స్తంభాలలో నాలుగు ఎరుపు రత్నాలు మరో నాలుగు స్తంభాలలో నాలుగు పసుపు ధర్మచక్రాలు అలాగే ఆఖరికి నాలుగు స్తంభాలలో నాలుగు తెల్లని పద్మాలుంటాయి. ఈ 16 స్తంభాల మధ్యలో ప్రతి రెండు స్తంభాల మధ్యలో అనగా ఎనిమిది స్తంభాలకి ఎనిమిది తెల్లని పద్మాలుంటే మిగిలిన ఎనిమిది స్తంభాల సీలింగ్ మీద ఎనిమిది ఎరుపు పద్మాలుంటాయి.అలాగే క్రింద ఉన్న ఎనిమిది తెల్లని పద్మాలలో రెండు రంగుల మిళితమైన ఎనిమిది బిందులుంటాయి.అలాగే ఈ పద్మాల ప్రక్కనే ఎనిమిది తెల్లని కూజా(vases) నిర్మాణములుంటాయి.ఈ అంతటి నిర్మాణమును జ్ఞానం (wisdom) అంటారు.ఆ తర్వాత మనకి మూడు పొరలుండి నలుచదర నిర్మాణము మూలలో నాలుగు బిందువులు ఉన్న నిర్మాణము కనపడుతుంది.ఈ నాలుగు బిందువులు వరుసగా మనస్సు,వాక్కు,జ్ఞానం,శరీరం సంకేతముగా నల్లని ముత్యం , శంఖము,ఒక వంశ వృక్షం,పద్మం కనపడతాయి.ఈ నిర్మాణము పైన మనకి ఒక అష్టదళ పద్మముంటుంది.దీనిలో ఎనిమిది బిందువులుంటాయి.వీటి సంకేతాల ప్రకారము చూస్తే శక్తి(power), ఆకాంక్ష(aspiration), సిద్ధాంతము(method),ఇచ్చుకొనేగుణము(giving),క్రమశిక్షణ(discipline),సహనం(forbearance),ఉత్సాహం(zeal),ధ్యానము(meditation) అని చెప్పడము జరుగుతుంది.ఈ పద్మమునకు మధ్యలో మళ్ళీ మనకి అయిదు పొరలున్న గుండ్రని పీఠము కనపడుతుంది. ఈ అయిదు పొరలు సంకేతముగా కేతు, రాహు, సూర్యుడు, చంద్రుడు,కమలం ఉంటాయి.వీటిలో కేతు అనేది నిరాకార శూన్యం(empty form),రాహు అనేది మార్పు లేని ఆనందం(immutable bliss),సూర్యుడు అనేది మంచి జ్ఞానం(wisdom),చంద్రుడు అనేది చేసిన పాపాల పరిహారం(compassion),అదే కమలం అయితే త్యజించడం(renunciation) అనే వాటికి సంకేతాలుగా మనకి కనపడతాయి.  ఈ పీఠభాగము మధ్యలో మనకి నీలమణిలాగా ఒక నీలిరంగు డ్యోర్జీ మధ్యబిందువుగాను,దీని పక్కనే పసుపు రంగులో ఒక చిన్న డ్యోర్జీ నిర్మాణాలు కనపడతాయి.వీటిలో నీలిరంగు డ్యోర్జీ అనేది పురుషశక్తిగా,పురుషాంగముగా,వీర్యకణముగా,అవలోకితేశ్వరుడిగా సంకేతమైతే..పసుపు రంగు డ్యోర్జీ అనేది స్త్రీ శక్తిగాను,యోని భాగముగా,అండముగా,అవలోకితేశ్వరీకి సంకేతముగా చెప్పడము జరుగుతోంది.ఈ నిర్మాణమును ఆనందము (bliss) అంటారు. ఇదంతా 3డి కాలచక్రనిర్మాణము అన్నమాట.

ఇపుడు ఇది ఎలా కైలాస పర్వతమునకు దారి చూపుతుందో మీకు వివరముగా చెపుతాను.మనకి కనిపించే ఆరు వృత్తాలు అనేవి హిమాలయ పర్వతాలైన ఎవరెస్ట్,కాంచనగంగా,అన్నపూర్ణ,ఛోవ్ లా,నంగా పర్వత,ఖుంబూ ఇలా ఉన్న ఆరు పర్వతశ్రేణులను చూపడము జరిగింది.అలాగే మనము ఈ రహస్య గ్రామానికి వెళ్ళలంటే మూడు పురాలను దాటవలసి ఉంటుంది.దీనికి సంకేతముగా శరీరం,వాక్కు,మనస్సు అనే నాలుగు గాలిగోపుర నిర్మాణాలు పెట్టడము జరిగింది.ఈ మూడు పురాలలో ముందుగా మనకి శరీర మాయలకి సంబంధించినది. అనగా ఈ నిర్మాణ గాలిగోపురములో మనకి మంచు సింహాలు కనపడతాయి.అంటే మొదటి పురము నందు మనకి మంచు జంతువులు అనగా మంచు కుక్కలు,మంచు పులులు,మంచు సింహాలు,మంచు ఏనుగులు వలన మనకి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని సూచించడము జరిగింది.ఇక రెండవ నిర్మాణమైన వాక్కును చూస్తే మనకి దీనికి సంబంధించిన మాయలను మనము దాటుకోవాలి.అనగా గాలిగోపురాలను మోసే బలిష్ఠ వ్యక్తులను పెట్టడము వెనుక ఈ వ్యక్తులు మనకి దర్శనము అవుతారు.అపుడు మనము మన వాక్కును అదుపులో ఉంచుకోవాలి.లేదంటే వారి కోపావేశాలకి గురై శాపాలు పొందవచ్చును.ఇక మూడవ నిర్మాణమైన మనస్సు చూస్తే మనస్సు మాయలో పడకుండా చూసుకోవాలి.అనగా ఈ గాలిగోపుర నిర్మాణములో మనకి కాంతి శరీర దేవతలను ఉంచడము జరిగింది. అంటే సిద్ధులున్న సిద్ధపురుషులు మనకి దర్శనమిచ్చి వారి సిద్ధమాయలలో మన మనస్సును ఉంచే అవకాశాలున్నాయి.వీటిని మనము సాక్షిభూతముగా చూస్తూ వారి అనుగ్రహముతో ముందుకి సాగిపోవాలి అన్నమాట.ఇక నాలుగ నిర్మాణమైన జ్ఞానం నిర్మాణములో మనకి 16 స్తంభాల నిర్మాణము మళ్ళీ అందులో నాలుగు స్తంభాల చొప్పున నాలుగు నల్లని కత్తులు,నాలుగు ఎరుపు రత్నాలు,నాలుగు పసుపు ధర్మచక్రాలు,నాలుగు తెల్లని పద్మాల అమరికను ఉంచారు.దీనిని బట్టి చూస్తే మనకి నాలుగువ పురము నందు నాలుగు యుగాల కాలము నాటి వ్యక్తులు దర్శనమవుతారు.అనగా కత్తులు అనేవి కలియుగముగాను,ఎరుపు రత్నాలు అనేవి ద్వాపరయుగముగాను,ధర్మచక్రము అనేది త్రేతాయుగముగాను, తెల్లని పద్మము అనేది సత్యయుగముగాను మనము అనుకోవచ్చును.కలియుగములో కుతంత్రాల యుగము గదా అందుకే కత్తులను,అదే ద్వాపరయుగములో యుద్ధకాంక్ష వలన ఎర్రని రక్తము ఏరులై పారడము వలన ఎరుపు రత్నాలతో,అదే త్రేతాయుగం అనేది ధర్మపాలన అందించిన శ్రీరాముడి కాలసూచనగా ధర్మచక్రమును, అదే తెల్లని పద్మాలు అనేవి పరిశుద్ధ మనస్సులున్న సత్యయుగ సంకేతాలుగా చెప్పడము జరిగింది.ఇలా ఈ జ్ఞాన నిర్మాణమును మనము దాటితే అష్టదళ పద్మ నిర్మాణము కనపడుతుంది.అంటే కైలాస పర్వతము చుట్టు మనకి అష్టదళ పద్మకార పర్వతాలు ఉంటాయని చెప్పడము జరిగింది.అలాగే అయిదు పొరలున్న మణిపీఠ నిర్మాణము చూస్తే మనకి స్ఫటిక మణి అయిన కైలాస పర్వతము సూచిస్తుంది.ఈ పొరలు అనేవి నాకు తెలిసి ఈ పర్వతము అడుగుభాగములో మనకి అయిదు పొరల నిర్మాణమును సూచన చేస్తోంది.అంటే మనము ఈ పొరలు లోపలకి వెళ్ళితే మనకి మధ్యబిందువుగా చింతామణి దర్శనమవుతుందని సూచనగా  నీలి మరియు పసుపు రంగు ద్యోర్జాల నిర్మాణాలు అనేవి మనకి గావలసిన రెండు చింతామణులకి సంకేతాలుగా పెట్టడము జరిగింది. జరిగినదని నా పరిశోధనలో తెలుసుకున్నాను అనగానే

ఆనందభిక్షువు వెంటనే గురూజీ..అంటే ఈ కాలచక్రతంతు అంతాగూడ హిమాలయములోని కైలాస పర్వతమును సూచించుటకు ఇంతా తంతంగము అవసరమా అనగానే

మిత్రమా.. ఇపుడున్న టెక్నాలజీ అపుడు ఆయన కాలములో లేదు గదా. ఇపుడు నువ్వు కైలాస పర్వత దర్శనము అంటే రోజుల నుంచి గంటలలో విమానాలు లేదా హెలికాఫ్టర్ ద్వారా వెళ్ళే సౌలభ్యము అవకాశాలున్నాయి. ఆ కాలములో జంతువులనే వాహనములను చేసుకొని కాలినడక యాత్రలు పూర్తిచేసుకొని వాళ్లు ఇలా కష్టపడి తెలుసుకున్న సత్యాలు లోకానికి అలాగే రాబోవు తరాలకి అందించటానికి ఇలా చక్రాలరూపములో,యంత్రాలరూపములో,దైవస్వరూపాల నిర్మాణ రూపలలో మనకి అందించడము జరిగింది. వాళ్ళు ఈ ఆలోచన మనకి ఇవ్వకపోతే మనము ఈనాడు మనకి వాళ్ళు తెలుసుకున్న సత్యాలుగా వాస్తవికత రూపములోనికి వచ్చేది కాదుగదా.ఇలా మన పూర్వీకులు చెప్పినవి ఉన్నాయో లేదో అవి సత్యాలు అవునో కాదో అని మనవాళ్ళు ఇపుడు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని అవి సత్యాలేనని లోక ప్రచారము చేస్తున్నారు.అంటే వేదజ్ఞానం అనేది ఆలోచనలు అయితే శాస్త్రాల విజ్ఞానం అనేది ఈ ఆలోచనలకి వాస్తవికత రూపమును ఇచ్చేవి అన్నమాట.ఆలోచన లేకపోతే భావరూపము ఎక్కడనుండి వస్తోందో ఒకసారి ఆలోచించు.ఇలా మన పూర్వీకులు కష్టపడి పరిశోధన చేసి అలాగే తమ ధ్యాన అనుభవ జ్ఞానముతో తెలుసుకున్న సత్యాలు మనము ఇపుడు తిరిగి అవి ఉన్నాయో లేదో అని ప్రయోగాలు చేసి తెలుసుకుంటున్నాము.అంతెందుకు మన బ్యాటరీ తయారి విధానము మన అగస్య సంహిత గ్రంథములో మనకి కనపడుతుంది. అనగా

సంస్ధాప్య మృణ్యయేపాత్రే తామ్ర పత్రం సుసంస్కృతం

ఛ్యాద్యేచ్చిభిగ్రీవేనఛార్ధాభి:కాష్టాపాంసుభి..

దస్తాలోష్ణోనిధాత్వయ:పారదాచ్చాదితస్తత:

సంయోగజ్ఞాయతే తేజోమిత్రావరుణసజ్ఞితం:

అంటే దీని ప్రకారము చూస్తే ఒక మట్టికుండ( మృణ్యయేపాత్రే) తీసుకొని  దానిలో రాగి ఫలకను(తామ్ర పత్రం) అమర్చి దానిలో లోపల మైలు తుత్తం అంటే కాఫర్ సల్ఫేట్ ను తీసుకొని వెయ్యాలి.తడిసిన రంపపు పొట్టును వెయ్యాలి.దాని మీద పాదరసముతో తాపడము చేసిన దస్తా (జింక్) ఫలకాన్ని అమర్చి తీగెలను కలిపితే మిత్రావరుణ శక్తి అనగా విద్యుత్ ఉద్భవిస్తుందనిచెప్పడము జరిగింది.అలాగే ఈ గ్రంథములో మనకి విమాన విద్య గూడ ఉంది.అనగా వంద కుండల శక్తిని నీటి మీద ప్రయోగము చెస్తే అది ప్రాణవాయువుగా,ఉదజని వాయువుగా విడిపోతుందని,ఈ ఉదజని వాయువును వాయునిరోధకవస్ర్తములో బంధించినట్లే అయితే విమానము ఎగురుతుందని అగస్య మహాముని చెప్పడము జరిగింది.అంటే ఆనాటి పుష్పకవిమానాలు ఈ విధానముతోనే నడిచాయి.ఇపుడే ఇదే విద్యతో మనము విమానాలు తయారు చేశాము.ఆ నాటి మాయదర్పణ వీక్షణ సిద్దాంతము ఇపుడు మనము వాడుతున్న ఇంటర్నెట్ అలాగే దుర్యోధనుడి మరియు వీరి సోదరుల కుండ జనన విధానము ఇపుడున్న టెస్ట్ట్యూబ్ విధానము అన్నమాట.అంతెందుకు ఆ కాలములో మన గణపతికి ఉన్న నరముఖము తొలగించి గజముఖమును అమర్చి ప్రాణాలు పోసిన విధానము ఇపుడు ఉన్నవారికి అందాలంటే ఇంక 300 సం.పైనే పడుతుంది.ఎపుడో సత్యయుగము వాళ్ళు అందుకున్న టెక్నాలజీ మనము 12లక్షలు పూర్తిచేసుకొని కలియుగములోనికి అడుగుపెట్టిన గూడ అందుకోలేదంటే మన టెక్నాలజీ విజ్ఞానం ఏపాటిదో ఆలోచించుకోవచ్చును అనగానే

ప్రకృతి వెంటనే స్వామి మనకి మూలము కైలాస పర్వతమని తెలిసినపుడు సరాసరి అక్కడికి వెళ్లవచ్చు గదా అనగానే

ప్రకృతి.. అలా మనము వెళ్ళితే మనకి అందరికి కనిపించినట్లే నాలుగు ముఖాల పిరమిడ్ ఆకారము కనపడుతుంది.మనము వెళ్లవలసినది ఈ పర్వత అడుగుభాగములోనికి వెళ్ళితే కాని మనకి రహస్య గ్రామాల దర్శనము కాదు.వీటికోసము వాళ్ళు ఏర్పరచిన సొరంగ మార్గాలలోనికి వెళ్ళాలి.ఈ మార్గాలు ఎక్కడ ఎలా ఉన్నాయో మనకి తెలియవు.ఎందుకంటే ఈ మార్గాలు అంతాగూడ మనకి తెలిసి అర్ధమయ్యే అర్ధముకాని పద్మవ్యూహములాగా ఉంటాయి.దారితప్పితే అభిమన్యుడిలాగా అర్ధాంతర మరణమును పొందుతాము.అదే దారి తెలిస్తే అర్జునుడిలాగా ఈ వ్యుహమును ఛేదించగలము.అందుకే మనకి ఈ ఆధార రూట్ మ్యాప్ ను మనపూర్వీకులు అంత భద్రముగా గీచి దానిని దాచి ఎవరి చేతిలో పడకుండా ఒకవేళ పడిన గూడ అర్ధము కాని రహస్యభాషలో రాయడము జరిగింది.అర్హత,యోగ్యత ఉన్నవారి చేతికి అందేటట్లుగా వారికి మాత్రమే అర్ధమయ్యే విధంగా వీటిని ఏర్పరచి భద్రపర్చడము జరిగింది అనగానే

ఆనందభిక్షువు వెంటనే గురూజీ..మీరు చెప్పినది అక్షర సత్యము ఎలా అంటారా..నేను ఎన్నోసార్లు కాగితాలమీద,నేలమీద 2డిలో కాలచక్రాలు గీశాను. కాని నాకు ఎన్నడు మీరు చెప్పిన విధాన దృష్టిలో చూడలేకపోయాను. ఇపుడు మీరు చెప్పిన కాలచక్ర తంతువిధానము విన్న తర్వాత నా బుర్ర కాలచక్రములాగా తిరగడము ఆరంభమైంది. అర్హత,యోగ్యతఉన్నవారికి మాత్రమే దైవ రహస్యములలోని మర్మాలు అర్ధమవుతాయని ఇపుడు నాకు అర్ధమైంది అంటుండగా

ఉన్నట్టుండి...హఠాత్తు పరిణామముగా

గుర్రు..గుర్రు..గుర్రు మంటూ

మంచు పొదల నుంచి ఆకస్మాత్తుగా సుమారుగా...

1 కామెంట్‌:

  1. గురువు గారికి padabivandanamulu...🙏🙏🙏ఇందులో మీరు chesina kalachakra tantram chudalante yelano telupagalaru......yevaryite mantra Archana sampurnam చేస్తారో అని rasaru.....sampurnam ante yelago telupagalarani manavi🙏🙏

    రిప్లయితొలగించండి