27 భాగం

 

27

ఇలా మేమిద్దరము కలిసి అలారకాలామ ఆశ్రమానికి చేరుకోగానే.... ఆయన అక్కడ తన 400 మంది శిష్యులకి వేదజ్ఞాన బోధ చేస్తూ నాకు కన్పించారు. వయస్సు సుమారుగా 70 సంవత్సరాల పైన ఉండవచ్చును. ముఖములో ఆకర్షణ, తేజస్సు ప్రస్ఫుటంగా  కనపడుతున్నాయి. మాటలో  తొట్రుపాటు కాని వణుకు తనము లేదు. ఇలా వీరి జ్ఞాన పాఠము పూర్తికాగానే శిష్యులంతా ఎవరి కుటీరాలకి వాళ్లు వెళ్లిపోవడముతో మేమిద్దరము ఆయన పాదాల దగ్గరికి చేరుకోగానే...

నాతో వచ్చిన భార్గవ ఆయనతో "స్వామి. మీ అనుగ్రహం కోసము వచ్చాడు" అనగానే....

అప్పుడు నేను వెంటనే ఆయన పాదాలమీద పడి నమస్కారము చేసి

"గురువుగారు. నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి. నేను జ్ఞానము కోసము మీ దగ్గరికి వచ్చాను" అనగానే....

ఆయన వెంటనే-

మంచిది. నాయనా. నీకు వేద జ్ఞానము గావాలా లేదా అనుభవ జ్ఞానము గావాలా అని అడిగేసరికి....

నేను వెంటనే

మహాత్మా. వేద జ్ఞానము నాకు వంట పట్టింది కాని నాకు అనుభవ జ్ఞానము గావాలి. అది మీరు ప్రసాదిస్తారని తెలిసి దూరదేశము నుండి నేను రావడము జరిగింది.”

ఆయన వెంటనే....

మంచిది. చాలా మంది శిష్యులు తమ భుక్తికోసము వేదజ్ఞాన సముపార్జన చేసే వాళ్లే నా దగ్గరికి వస్తుంటారు. కాని నీవు అది వద్దని.... అనుభవ జ్ఞానము గావాలని రావడము నాకు చెప్పరాని ఆనందమేస్తుంది. నిజజ్ఞాన గురువుకి నీలాంటి శిష్యుడు గావాలి. అప్పుడే అనుభవ పాండిత్య జ్ఞానము గూడ లోక ప్రచారము అవుతుంది. జాగ్రత్తగా విను. నిజానికి నిజ సాధకుడికి గావాలసినది గూడ అనుభవ జ్ఞానమే. ధ్యాన అనుభవాల ద్వారా పొందే జ్ఞానమే అనుభవజ్ఞానమవుతుంది. ఇదియే స్వీయజ్ఞానమంటారు. ఇదియే ఆత్మజ్ఞానమని గూడ అంటారు. ఈ జ్ఞానము పొందటానికి సాధకుడు గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. మనస్సులో ముద్రించబడిన ఆవేశపూరిత, ఆనందపూరిత సంఘటనలు పూర్తిగా మర్చిపోవాలి. అంటే గతమునకు సంబంధించిన ఆలోచనలు తగ్గించుకోవాలి. ఆలోచనలు తగ్గాలంటే శ్వాస మీద దృష్టి పెట్టాలి. శ్వాస మీద దృష్టి నిలపాలంటే మనస్సు నిగ్రహించుకోవాలి. మనస్సు నిగ్రహించుకోవాలంటే మనం తినే ఆహారము శుద్ధిగా ఉండాలి. అంటే ఆహారమును బట్టి మనలో గుణాలు ఉద్రేకమవుతాయి. అవియే సాత్విక,  రజో, తమో గుణాలు అన్నమాట. ఈ గుణాలను బట్టి భావాలు కలుగుతాయి.భావాలను బట్టి ఆలోచనలు కలుగుతాయి.ఆలోచనలు బట్టి మన బుద్ధి నడుస్తుంది. బుద్ధిని బట్టి మన మనస్సు నడుస్తోంది. మన బుద్ధి అవివేక ఆలోచనలు చేస్తే మన మనస్సు కాస్త అజ్ఞానమును పొందుతుంది. అదే మన బుద్ధి కాస్త వివేకమైతే మన మనస్సు కాస్త జ్ఞానమవుతుంది. కాబట్టి మనస్సు శుద్ధికి అలాగే శరీర శుద్ధికి తొలి సాధనగా ఆహారశుద్ధి ఉండాలి. ఇదే నా తొలి పాఠము అని చెప్పి ఆయన కుటీరములోనికి మౌనముగా వెళ్లిపోయారు.

*** *** *** *** *** ***

కులక్ర్ణికి ఫోన్ రావడముతో దానిని అందుకోగానే జేసి బృందము తన ఉచ్చులోంచి ఎలా తప్పించుకున్నారో తెలుసుకొనేసరికి కోపమును ఆపుకోలేక ఫోన్ నేలకేసి కొట్టేసరికి అది కాస్త ముక్కలైనది.తన హృదయములాగా..

అరే.నిర్వాణలామా మార్షల్ ఆర్ట్స్ శక్తిని అంచనా వేయలేకపోయినందుకు తనని తాను తిట్టుకున్నాడు.అంచనా వేసి ఉండి ఉంటే తమ పోలీసు బృందములో మార్షల్ అధికారి ఉండేటట్లుగా చేసి ఉండి ఉంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటుండగా మిగిలిన వాళ్ళని అరెస్టు చేసే అవకాశము తనకి ఉండేదని అనిపించసాగింది.బాధ మరింత పెరగసాగింది.

ఇంతలో మెరుపు ఆలోచన రాగానే తన ఇంటి నుండి జేసి ఇంటికి దగ్గర ఉన్న జేసి కారు దగ్గరికి వెళ్ళడము జరిగింది.

ఈ కారు అద్దాలను తన దగ్గర ఉన్న తాళం చెవి తో తెరిచి ఈ కారులో జేసికి తెలియకుండా అమర్చిన ఒక వాయిస్ రిసీవర్ ను కారు సీటు క్రింద నుంచి తీసి తన చేతిలో  ఉన్న ఫోన్ కి ఇది కనెక్ట్ చేయగానే వాళ్ళూ మాట్లాడుకున్న అన్ని విషయాలు అనగా తన తండ్రి లాకర్ నుండి తెచ్చిన బాక్స్ లో ర్యాపిడ్ ప్రశ్నల గేమ్ వివరాలు అందులో ఉన్న వచ్చిన విభూధినాధ్ ఆధార వివరాలు, గంజాయి స్వామి వివరాలు అన్ని తెలుసుకొని అంటే వీళ్ళంతా కాశీక్షేత్రానికి విభూధినాధ్ ను కలుసుకోవడానికి వెళ్ళుతున్నారని తెలుసుకొని

తన ఫోన్ లో నెట్ లో ఈయన గూర్చి ఎంక్వైరి చేయగా ఈయన బౌద్ధ ధర్మ ప్రొఫెసర్ అని అక్కడ ఉన్న యూనివర్శిటీలో పనిచేసి పదవి విరమణ పొందాడని ఈయన స్నేహితుడు చనిపోయిన బౌద్ధ సన్యాసి అంబేద్కర్ అని తెలియగానే కులకర్ణి నొసలు ముడిపడినాయి.అంటే వీళ్ళు చేస్తున్న ఉన్నదో లేదో తెలియని మణి శోధనకి ఈ ప్రొఫెసర్ కి ఏదో సంబంధము ఉండి ఉండాలి.లేకపోతే ఈయన గూర్చిన వివరాలు ర్యాపిడ్ పజిల్స్ లో ఆధారముగా ఎందుకు పెడ్తారు.కాబట్టి ఈయన  దగ్గర ఉన్న సమాచారము ఏదో తెలుసుకోవాలని నిర్వాణలామా బృందము మరొకవైపు దేవదత్త అనుచరుడైన అంగుళీమాల ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించడానికి అట్టే సమయము పట్టలేదు.

తాను చేయవలసిన పరిశోధనను దేశద్రోహులు,శాంతమూర్తులు చేస్తుండేసరికి కోపమును ఆపుకోలేకపోయాడు.తన ఓటమిని అంగీకరించలేకపోతున్నాడు.ఏదో ఒకటి చేయాలి.ఏమిచేయాలో ఎలా చేయాలో అర్ధము కాని పరిస్థితి.అయోమయ స్థితి.అన్ని వివరాలు తెలుస్తున్నగూడ ఏమి చేయలేని స్థితి.ఒక ప్రక్క దేశ ద్రోహుల చేతిలో దేశ రహస్యము వెళ్ళిపోతే ఎలా?మరోప్రక్క దేశద్రోహుల చేతిలో శాంతమూర్తులు మరణము పొందితే ఎలా?అనే ఆలోచన ఆవేదన భారముతో సిగార్ వెలిగించుకుంటూ శాంతముగా వివేక బుద్ధితో ఆలోచించడము ప్రారంభించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి