42 భాగం

 

42

అలాగే మనకున్న దుఃఖము ఏమిటో తెలుసుకోవాలి. ఈ దుఃఖానికి కారణము ఏమిటో తెలుసుకోవాలి. ఆపై దుఃఖము నుండి ఎలా ఉపశమనము పొందాలో తెలుసుకోవాలి. ఆపై ఈ దుఃఖ ఉపశనమార్గము వెతుక్కోవాలి. అసలు దుఃఖాలు కల్గుడానికి  మనము తెలిసి అయిదు కారణాల తప్పులు చెయ్యడము వలన కల్గుగుతున్నాయని గ్రహించాను. అవియే

1 . దొంగతనం

2 . వ్యభిచారము

3 . మత్తు పదార్ధాల సేవనం

4 . అసత్యము చెప్పుట

5 . జీవహింస

ఈ అయిదు పాపకార్యాలు మనకు దుఃఖ హేతువులు అవుతున్నాయి.. వీటిని మనస్సుతో కాని శరీరముతో కాని నోటితో కాని చెయ్యకుండా నిగ్రహించుకుంటే దుఃఖము రాదని.... దుఃఖము కల్గుదని... దుఃఖమే ఉండదని నా అనుభవ జ్ఞానము ద్వారా గ్రహించాను. ఈ సత్యజ్ఞానము మీకు చెప్పాలని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి రావడము జరిగింది.

దానితో మిత్రులు అందరు గూడ ముక్త కంఠముతో.... మహాత్మా. మీరు చెపుతోంది సత్యమే. సత్యమే. అన్యధా శరణం నాస్తి... త్వమేవ శరణం మమ అంటూ మమ్మల్ని మీ శిష్యులుగా స్వీకరించండి అంటూ నా కాళ్ల మీద పడేసరికి...

నేను కాస్త మీకు అర్ధమైనదని నాకు అర్ధమైంది అంటూ వాళ్లని ఆశీర్వాదము చేస్తూ....

నాకు ఊరువిల గ్రామ వాసులు అంతా గూడ 'బుద్ధ' అని పేరు పెట్టారు. ఆపేరు నాకు బాగుంది. ఈనాటి నుండి మీరుగూడ నన్ను ఈ పేరుతోనే పిలవండి. మూడు నెలలలో  మీరు గూడ నాకు లాగానే బుద్ధులు అవుతారు. బుద్ధ అంటే బుద్ధిని బుద్ధం చేసినవాడని అర్ధము. అనగా అజ్ఞాన బుద్ధిని తొలగించుకొని వివేక జ్ఞాన బుద్ధిని పొందుతారు. ఆనాటితో మీరు బోధి సత్వులవుతారు. ఆపై తథాగతుడై మహా నిర్యాణము చెందుతారు అంటూ వారందరిని ప్రేమతో దగ్గరికి తీసుకొని కౌగలించుకొని ఆశీస్సులు ఇచ్చాను.

ఆ తర్వాత వీరంతా అనతి కాలములోనే నేను పొందిన జ్ఞానము పొంది- నేను పొందిన జ్ఞానము సత్యమేనని... ఇందుకు నేను ప్రతిపాదించిన అష్టాంగయోగ నియమాలు మరియు పంచశీలసూత్రాలు ఈ జ్ఞాన మార్గానికి తీసుకొని వెళ్తాయని రూఢి చేసుకోవడముతో….

అపుడు మేమంతా కలిసి... వారితో నేను-

"ఇప్పుడు మనమంతా ఒక సంఘం. మనది బుద్ధిని బుద్ధం చేసే సంఘము కాబట్టి మనది బౌద్ధ సంఘం. ఇది మతముకాదు. అలాగని నా అభిమతము కాదు. ఇది ధర్మము మాత్రమే. మనమంతా బౌద్ధ భిక్షువులుగా మారి అందరికి ప్రేమ, కరుణ పంచడం మన కర్తవ్యం. దానితో వారు ఆనందము, శాంతిని పొందడము జరుగుతుంది. అనగానే... ఆనాటి నుండి బౌద్ధ ధర్మ సంఘం నాంది అయింది.

*** *** *** *** *** ***

జేసి వెంటనే లామాజీ.మీరు చెబుతున్న ధర్మరాజు స్వర్గారోహణ కధనము ఎలా నిజమని తెలుసుకున్నారు?”

జేసి.అసలు పంచ పాండవులు ఏ విధముగా బద్రినాధ్ పర్వత ప్రాంతాల నుండి ఉన్నదో లేదో తెలియని స్వర్గారోహణ చేసినారో తెలుసుకోవాలని అలాగే సైన్స్ ప్రయోగాలకి ఈ సమాచారము ఉపయోగపడుతుందని అనుకొని ఈ క్షేత్రానికి నేను వెళ్ళి పరిశోధన చేస్తే నిజముగా మహాభారతములో చెప్పబడిన ప్రాంతాలు అక్కడ కనిపించేసరికి నాలో తెలియని ఆనందమేసినది.స్వర్గారోహణ అనేది కట్టుకథ కాదని అది నిజమేనని తెలుసుకున్నాను.

అది ఎలా అంటే

బద్రినాధ్ క్షేత్రము నుండి 5కి.మీ దూరములో మానా అనే చిన్న గ్రామము ఉన్నది.ఇది భారతదేశానికి చిట్టచివరి గ్రామము.ఆపై ఇక్కడి నుండి టిబెట్ ప్రాంతము మొదలవుతుంది.ఈ గ్రామము చివర మనకి ప్రారంభ సరస్వతి నది ప్రవహించే ప్రాంతము కనబడుతుంది.ఇక్కడ ప్రసిద్ధి  చెందిన సరస్వతి మాత ఆలయము ఉంది.అలాగే ఈ నది అంతర్వాహినిగా బద్రినాధ్ క్షేత్ర సమీపములో ప్రవహించే అలకానంద నదిలో కలుస్తుంది.ఈ సరస్వతి నది ఒడ్డున మనకి భీమ్ పుల్ అనే ఒక పెద్ద రాతి బండ కనబడుతుంది.ఈ రాతి మీద మనకి భీముని వేలిముద్రలు కనబడతాయి.ఈ నదిని దాటటానికి పాండవులు కాస్త ఈ రాతిబండను వంతెనగా వాడుకున్నారని తెలుస్తోంది.ఈ వంతెన దాటిన తరవాత స్వర్గారోహణ మార్గము ప్రారంభమవుతుంది.

అంటే 8కి.మీ దూరములో చట్మోలీ ప్రాంతమునకు చేరుకోవాలి.ఈ ప్రాంత మార్గ మధ్యములో మనకి ఎన్నో విచిత్రాలు సాక్ష్యాలుగా కనబడతాయి.వాటిలో భృగు మహర్షి ఆశ్రమము కనబడుతుంది.

ఆ తరవాత నరనారాయణుల కన్నతల్లిగా భావించే మాతమూర్తి ఆలయము కనబడుతుంది.

తరవాత కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిన కుబేర్ మకుట్ ప్రాంతము కనబడుతుంది.

ఈ ప్రాంతము నుండి సుమారుగా 5కి.మీ దూరము ప్రయాణిస్తే మనకి వసుధార జలపాతము కనబడుతుంది.ఇక్కడ అష్ట వసువులు అనగా

ధరో ధ్రువశ్చ సోమశ్చ అహైశ్చ

వానిలో అనలః

ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో

అష్టోః ప్రకీర్తితా.

మహాభారతంలోని ఆది పర్వం 66-16 ఉన్న శ్లోకము బట్టి చూస్తే

ధరుడు, ధ్రువుడు, సోముడు, అహస్సు,అనిలుడు,అనలుడు,ప్రత్యూషుడు,ప్రభాసుడు..ఈయనే భీష్మాచార్యుడు. వీళ్ళు సుమారుగా ఈ ప్రాంతమునందు 1000 సం||రాలు పాటు తపస్సు చేయడము వలన ఈ జలపాతమునకు ఈ పేరు రావడము జరిగినదని నేను తెలుసుకున్నాను.

ఆ తరవాత మనకి చట్మోలి అనే అందమైన పచ్చని బయళ్ళు ఉన్న ప్రాంతమునకు చేరుకుంటాము.ఇక్కడ సతోపంత్ మరియు భగీరధ్ కర్క్ అను రెండు హిమానీ నదులు కలసి అలకానంద నదిగా ఏర్పడతాయి అని నా పరిశోధనలో తెలుసుకున్నాను. 

ఈ చట్మోలి ప్రాంతము నుండి 1 కి.మీ దూరములో ఉన్న లక్ష్మీవన్ ప్రాంతమునకు చేరుకోవాలి.ఇక్కడ అనేక రకాల దేవతాపుష్పాలు,సుగంధభరిత పుష్పాలు ఉంటాయి.ఈ ప్రాంతమునందు ఆది మహా విష్ణు అలాగే ఆది మహా లక్ష్మీదేవి కొంతకాలము పాటు యోగ తపస్సు చేశారని ఈ స్థల పురాణగాధ.ఈ ప్రాంతమునందే పంచపాండవుల ధర్మపత్నియైన ద్రౌపది దేవి తనువు చాలించినదని నా పరిశోధనలో తెలుసుకున్నాను.

ఆ తరవాత వచ్చే 2 కి.మీ దూరము ప్రయాణము చేస్తే మనకి బంధర్ అనే ప్రాంతము వస్తుంది.ఇక్కడ ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగము చేశాడని ఈ స్థల కధనము.ఈ ప్రాంతమునందు పంచ పాండవులలో నాలుగవవాడైన నకులుడు తనువు చాలించాడు.

ఆ తరవాత ఇక్కడ నుండి 4 కి.మీ దూరములో సహస్ర ధార ప్రాంతము వస్తుంది.ఇక్కడున్న జలపాతము నుండి సహస్రధారలుగా పడతాయని స్థల పురాణము చెబుతోంది.ఇక్కడ పంచ పాండవులలో ఆఖరివాడు అయిన సహదేవుడు తనువు చాలించాడు.

ఈ ప్రాంతము నుండి 5 కి.మీ దూరములో మనకి చక్ర తీర్ధము వస్తుంది.ఇక్కడ విష్ణు మూర్తి తన సుదర్శన చక్రాన్ని కొన్ని నిమిషాల పాటు క్రింద పెట్టడము వలన ఈ తీర్ధము ఏర్పడినదని స్థల పురాణము చెపుతోంది.ఈ ప్రాంతమునందు పంచ పాండవులలో మూడవ వాడైన అర్జునుడు తనువు చాలించాడని నా పరిశోధనలో తెలుసుకున్నాను.

ఆ తరవాత ఈ చక్ర తీర్ధము నుండి 5 కి.మీ ముందుకు వెళ్ళితే మనకి సతోపంత్ అనే త్రిభుజాకృతిలో ఉన్న సరస్సు వస్తుంది.ఇది సుందరమైన 5 పర్వతాల మధ్య ఉంటుంది.పైగా ఈ సరస్సు యందు ప్రతి మాసములో వచ్చే రెండు ఏకాదాశి తిధుల యందు హంసల రూపములో త్రిమూర్తులు స్నానము చేస్తారని అలాగే సప్త ఊర్ధ్వలోకాల నుండి కాంతి శరీరాల దైవాత్మలు వివిధ పక్షుల రూపములో వీరిని సేవిస్తుంటారని స్థల పురాణగాధ.ఈ ప్రాంతమునందే పంచ పాండవులలో రెండవ వాడైన భీముడు తనువు చాలించాడని తెలుసుకున్నాను.

ఈ సతోపంత్ నుండి 8 కి.మీ దూరములో స్వర్గారోహిణి అనే ప్రాంతము వస్తుంది.ఈ మార్గము బహు కష్టముగా ప్రయాణానికి అంత వీలుగా ఉండదని నేను గ్రహించాను.ఈ మార్గములో మనకి సూర్యకుండ్,చంద్రకుండ్ అనే సరస్సులు కనబడతాయి.ఈ ప్రాంతము నుండే ధర్మరాజు తనతో వచ్చిన ధర్మదేవత రూపమైన ఆడ కుక్క తోడు రాగా స్వర్గానికి ప్రయాణించాడని ఈ స్థల పురాణము చెబుతోంది.ఇది ఆరు పర్వత సమూహముగా చెప్పవచ్చు.ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రములోని ఉత్తర కాశీ జిల్లాలో గల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి ఈ ప్రాంతము చెంది ఉన్నదని నేను తెలుసుకున్నాను.

ఈ స్వర్గారోహిణి పర్వత అగ్రభాగములో మూడు మెట్లుగా మేఘాలు నిరంతరముగా సంచరిస్తూ ఉంటాయని నేను తెలుసుకున్న నిజము.ఆపై ఈ మేఘాలు దాటి వెళ్ళితే మనకి మరో నాలుగు మెట్లు వస్తాయని వీటిని దాటితే మనకు స్వర్గ ముఖ ద్వారము మనకి కనబడుతుంది.అంటే ఒక రకముగా చెప్పాలంటే మన సైన్స్ పరిభాషలో ఇది బ్లాక్ హోల్స్ అన్నమాట.ఈ హోల్స్ ద్వారా వెళ్ళితే స్వర్గానికి వెళ్ళవచ్చని ధర్మరాజు యాత్రానుభవము మనకి నిదర్శనముగా తెలుస్తోంది.

అలాగే మనకి బద్రినాధ్ క్షేత్రానికి  రెండు కి.మీ దూరములో మనకి బ్రహ్మ కపాలము ప్రాంతము వస్తుంది.ఈ ప్రాంతములో బ్రహ్మదేవుడి పంచముఖమునకు మోక్షము కల్గినదని పురాణకధనము చెబుతోంది. పైగా ఈ ప్రాంతము నందు పితృదేవతలకి పిండ ప్రదానము చేస్తే మోక్షము కల్గుతుందని అలాగే ఇక్కడ పిండప్రదానము చేసిన తరవాత మాస శ్రాద్ధ కర్మలు అలాగే సంవత్సరీకాలు చేయకపోయిన పర్వాలేదని స్థల పురాణ ఉవాచ.ఈ లెక్కన చూస్తే పితృదేవతలకి సంబంధించిన బ్లాక్ హోల్స్ ఈ పర్వత ప్రాంతములో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం వలన చనిపోయిన మీ నాన్నగారు ఈ లోకమునందు ఉన్నారని రూడీ అవ్వడముతో నేను కాస్త ఈ క్షేత్రాన్ని నా సైన్స్ ప్రయోగమునకు ఎంచుకోవడము జరిగినదని చెప్పగానే

జేసి మరియు థామస్ ఎంతో ఆనందముతో చప్పట్లు కొడుతూ

నిర్వాణలామాజీ.మాకు ఇపుడు మనో ధైర్యము వచ్చింది.మేమిద్దరము గూడ మీ ప్రయోగానికి మా సమ్మతి తెలుపుతున్నాము.ఖచ్చితముగా పితృలోకములో ఉండే మా నాన్నగారిని కలుసుకొనే అవకాశాలు చాలా మెండుగా ఉండే బ్రహ్మ కపాల ప్రాంతము ఎంచుకోవడములోనే మీ అద్భుత నైపుణ్య తెలివితేటలు తెలుస్తున్నాయి అంటూండగా

ప్రకృతి ఉన్నట్టుండి అంబేద్కర్ గారు మీకు ఏదో చెప్పమని నాకు చెప్పారు అనగానే

జేసికి ఆనంద ఆశ్చర్యమేసింది.

ప్రకృతి మేడమ్.ఆయన మా నాన్నగారు.గాకపోతే ఇపుడు ప్రాణాలతో లేరు అనగానే

 జేసి.బాధపడకు.ఆయన శరీరముతో ప్రత్యక్షముగా ఉండకపోవచ్చును.కాని పితృలోకమునందు మీ అమ్మగారితో అలాగే బంధుమిత్రులతో మీరిద్దరి రాక కోసము ఆత్మ శరీరాలతో ఎదురుచూస్తున్నారని నేను అచేతన స్థితిలో ఉన్నపుడు నా అత్మతో అనుసంధానమై చెప్పారు.పైగా మావారి సైన్సు ప్రయోగ పరికరము ద్వారా మీరిద్దరు గూడ సజీవ మూర్తులుగా వారున్న లోకానికి వస్తున్నారని భవిష్యత్ గూడ చెప్పారు అనగానే

జేసి ముఖములో ఏదో తెలియని అనుమాన సందేహము రాగా..

జేసి.నేను చెప్పేది అక్షర సత్యమే. నా శరీరము అచేతన స్థితికి వెళ్ళింది గాని నా మెదడు చేతన స్థితిలోనే ఉంది.అంటే నిద్ర మెలుకవ కాని మధ్య స్థితిలో నా మెదడు పని చేసింది.దానితో నాకు వివిధ లోక దర్శనాలు, లోకవాసులు నా మనో నేత్రమునందు కనిపించేవారు.వారిని చూసినపుడల్లా నా శరీరము భయపడేది.కాని నా మాటలు, నా చేష్టలు చెప్పడానికి నా శరీరము సహకరించేది గాదు.అంతెందుకు నీకు మరియు మీ నాన్నగారికి మాత్రమే తెలిసిన కొన్ని వ్యక్తిగత విషయాలు మీ నాన్నగారు నాకు చెప్పారు.వాటిని విని నేను చెప్పినది నిజమో కాదో నువ్వే నిశ్చయించుకో అంటూ

ఆయన చెప్పిన విషయాలు పూసగుచ్చినట్లుగా పొల్లుపోకుండా అన్ని చెప్పేసరికి అన్ని నిజమేనన్నట్లుగా జేసి ముఖము దుఃఖపర్యంతమైంది.ఈ మాటలు విన్న నిర్వాణలామా తన సైన్స్ ప్రయోగము విజయవంతము అవుతుందని ముందుగానే తెలియడముతో తను పడ్డ కష్టానికి ప్రతిఫలము లభించినదని రూడీ చేసుకున్నాడు.

ఆ తరవాత విమానము కాస్త డెహరాడూన్ విమానాశ్రయములో ఆగినదని తెలుసుకొని అందరుగూడ నెమ్మది నెమ్మదిగా క్రిందకి దిగి అక్కడ నుండి కారులో బద్రినాధ్ క్షేత్రానికి చేరుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి